
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ కోసం భారత్కు చేరుకున్న ఆస్ట్రేలియా విధ్యంసకర బ్యాట్స్మన్, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. శుక్రవారమే టీమ్ క్యాంప్తో కలిసాడు. ఇక ఐపీఎల్ గైడ్లైన్స్ ప్రకారం ఏ ఆటగాడైన బయో బబుల్లోకి వెళ్లే ముందు వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందే. ఈ క్రమంలోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన డేవిడ్ భాయ్.. ఈ సమయాన్ని గడపడానికి ఏవైనా ఐడియాలు ఉంటే సూచించాలని ఇన్స్టా వేదికగా అభిమానులను కోరాడు.
" హాయ్ ఫ్యాన్స్.. చెన్నైకి చేరుకున్నాను. కానీ, ఒక సమస్య ఉంది. రానున్న వారం రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. కాలక్షేపం కోసం ఏమి చేయాలో సూచించండి. దయచేసి కామెంట్ చేయండి. అవసరమైతే కొన్ని మంచి సినిమాల గురించి సజెస్ట్ చేయండి" అని ఇన్స్టా వేదికగా వార్నర్ అభిమానులను కోరాడు. అయితే ఈ వీడియో పోస్ట్కు టీమిండియా డాషింగ్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'వార్నర్.. నువ్వు కచ్చితంగా టిక్ టాక్ను మిస్సవుతున్నట్లున్నావ్'అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇక గతేడాది లాక్డౌన్ సందర్భంగా వార్నర్.. టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరిని అలరించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హిందీ, తెలుగు సినిమా పాటలకు సతీమణి క్యాండిస్ వార్నర్తో కలిసి చిందేసి భారత్ అభిమానులు అలరించాడు. ఈ క్రమంలోనే రోహిత్ టిక్టాక్ లేక ఎంత పనాయే డేవిడ్ భాయ్ అనే అర్థంలో సరదగా కామెంట్ చేశాడు.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును నడిపిస్తున్న డేవిడ్ వార్నర్.. ఈ క్యాష్ రిచ్ లీగ్ కెప్టెన్లలో విజయవంతమైన సారథిగా గుర్తింపు పొందాడు. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్గా ఎంపికైన వార్నర్ 2018 మినహా అన్ని సీజన్లలో హైదరాబాద్ ప్లేఆఫ్కు చేరుకోవడం విశేషం. ఇక ఐపీఎల్లో 142 మ్యాచ్లాడిన వార్నర్ 42.71 సగటుతో 5,254 పరుగులు సాధించగా.. ఇందులో నాలుగు సెంచరీలు.. 48 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో సన్రైజర్స్ తన తొలి మ్యాచ్ను ఏప్రిల్ 11న కోల్కతా నైట్రైడర్స్తో ఆడనుంది.