ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శస్త్ర చికిత్స చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ ఎడమ కాలు గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ గాయం నేపథ్యంలోనే అతను టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు కూడా తెలుస్తోంది. మూడు ఫార్మాట్లలో టీమిండియాను నడిపించిన రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్ 2024తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ను విజేతగా నిలబెట్టాడు. టీ20 ప్రపంచకప్ విజయానంతరం పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఇటీవల టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇక నుంచి రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్లో మాత్రం కొనసాగనున్నాడు.
వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే తన లక్ష్యమని కూడా రోహిత్ శర్మ చెప్పాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ముగిసిన తర్వాత ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాలని రోహిత్ భావిస్తున్నాడు. ఎడమ కాలి నొప్పితో ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతున్న రోహిత్ శర్మ.. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు. ఈ సీజన్ ముగిసిన వెంటనే తన గాయానికి రోహిత్ సర్జరీ చేసుకోనున్నాడు.

ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. టీమిండియా వన్డే ఫార్మాట్ ఆడేందుకు చాలా సమయం ఉంది. ఆగస్టులో బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ఆడనుంది. ఆలోపు గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలని రోహిత్ భావిస్తున్నాడు. గతంలో 2016లోనూ రోహిత్ శర్మకు సర్జరీ జరిగింది. 3 నెలల తర్వాత తిరిగి అతను జట్టులోకి వచ్చాడు.
బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ జరగడంపై సందేహాలు నెలకొన్నాయి. పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్ కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సిరీస్లు జరగకపోతే.. ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్తో రోహిత్ శర్మ మళ్లీ మైదానంలో కనిపించనున్నాడు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.