టెస్ట్ ఫార్మాట్లో పేలవ ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గబ్బా టెస్ట్ అనంతరం రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లోనూ రోహిత్ శర్మ(10) దారుణంగా విఫలమయ్యాడు.
ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో రోహిత్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. గుడ్ లెంగ్త్ బాల్ను డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కేఎల్ రాహుల్ కోసం నెంబర్ 6లో బ్యాటింగ్కు వచ్చిన రోహిత్.. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే చాలా అసౌకర్యంగా కనిపించాడు. ముఖ్యంగా అతని ఫుట్వర్క్ చాలా పేలవంగా కనిపించింది. బంతి వచ్చేవరకు ఎదురు చూసేంత ఓపిక అతని ఆటలో కనిపించలేదు. క్రీజులో ఏ మాత్రం కదలకుండా షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు.

డగౌట్ వద్దే గ్లౌజ్లు..
దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన రోహిత్ శర్మ తన గ్లౌజ్లను డగౌట్ వద్దే పడేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లాడు. ఈ ఘటన అందర్నీ షాక్కు గురి చేసింది. వరుసగా విఫలమవుతుండటంతో రోహిత్ భావోద్వేగపూరితమైన నిర్ణయం తీసుకున్నాడా? అనే చర్చ మొదలైంది. గబ్బా టెస్ట్ ముగిసిన తర్వాత సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
గతంలో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ధోనీ తరహాలోనే రోహిత్ సైతం సంచలన నిర్ణయం తీసుకుంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ సిరీస్లో మూడు ఇన్నింగ్స్ల్లో 6 స్థానంలో బ్యాటింగ్ చేసిన రోహిత్.. మూడింటిలోనూ దారుణంగా విఫలమయ్యాడు.
రెండేళ్లుగా తడబడుతున్న హిట్ మ్యాన్..
గత రెండేళ్ల నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. మొత్తం 10 టెస్ట్లు.. 18 ఇన్నింగ్స్ల్లో 621 పరుగులు మాత్రమే చేశాడు. అతని టెస్ట్ కెరీర్ బ్యాటింగ్ సగటు 45 కాగా.. ఈ 18 ఇన్నింగ్స్ల్లో యావరేజ్ 34. ముఖ్యంగా స్వదేశంలో 62 యావరేజ్తో ఆడే రోహిత్ శర్మ.. విదేశాల్లో మాత్రం 33 సగటు మాత్రమే నమోదు చేశాడు.
ఇప్పటికే టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. టెస్ట్, వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెబుతున్నట్లు రోహిత్ శర్మ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం వన్డే ఫార్మాట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితేనే..
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్కు కూడా రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగి.. భారత్ ఫైనల్ చేరే అవకాశాలు కనిపించడం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిస్తేనే భారత్కు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కనుంది. ఇప్పటికే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.