ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే కండరాలు పట్టేయడంతో(క్రాంప్స్) మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాడు. అతను బయటకు వెళ్తుండుగా రోహిత్ శర్మ టీజ్ చేశాడు. డ్యాన్స్ చేస్తూ మరీ ఆట పట్టించాడు.
'నాలా ఫిట్గా ఉండాలి బ్రో.. లేకుంటే ఇలానే కండరాలు పట్టేస్తాయి'అని రహానేతో రోహిత్ అన్నట్లు కనిపించింది. రోహిత్ మాటలకు రహానే నవ్వుతూ ముందుకు సాగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

రోహిత్, రహానేలు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ఆడేవారు. వారి మధ్య ఎన్నో సాన్నిహిత్యం ఉంది. ఆ చనువుతోనే రహానేను రోహిత్ ఆట పట్టించాడు. ఇక రోహిత్ శర్మ ఫిట్నెస్పై ఫోకస్ పెట్టి 10 కిలోల బరువు తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను కరెంట్ తీగలాగా సన్నగా మారిపోయాడు. ఈ సీజన్ను రోహిత్ శర్మ ఘనంగా ప్రారంభించాడు.
విధ్వంసకర (38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 78) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్లతో 81)తో కలిసి తొలి వికెట్కు 148 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్లో బోణీ కొట్టింది. చివరిసారిగా 2012 సీజన్లో తొలి మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఇన్నాళ్లకు మళ్లీ విజయంతో ప్రారంభించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు చేసిన కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 67),అంగ్క్రిష్ రఘువంశీ(29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 51 ) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలరల్లో శార్దూల్ ఠాకూర్(3/35) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి గెలుపొందింది.