
న్యూఢిల్లీ: ఆసియా కప్ 2022లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తొలి మ్యాచ్లోనే తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ఇంకా 20 రోజుల సమయం ఉన్నప్పటికీ... దాయాదుల పోరుపై సందడి నెలకొంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. ఇక ఈ మ్యాచ్కు ఉండే క్రేజ్ను క్యాష్ చేసుకునే పనిలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నిమగ్నమైంది. అసలే సొంతగడ్డపై సిరీస్లు జరగ్గా.. ఓవర్సీస్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులు లేక గత రెండు నెలలుగా ఆకలి మీద ఉన్న స్టార్ స్పోర్ట్స్.. ఈ ఒక్క మ్యాచ్తో అన్నీ లెక్కలు సరి చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 28న జరిగే భారత్-పాక్ మ్యాచ్కు సంబంధించిన ప్రొమోలను వరుసగా వదులుతూ అభిమానులను ఆకట్టుకునే పని చేస్తోంది.
తాజాగా స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రొమోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాక్తో సమరానికి సై అన్నట్లుగా క్రీజ్లో కాలు దువ్వాడు. క్రికెట్ పరంగా భారత్-పాకిస్థాన్ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, ప్రత్యర్థి జట్టులోనూ మంచి ఆటగాళ్లు ఉన్నారని ఈ ప్రోమోలో రోహిత్ పేర్కొన్నాడు. భారత్ ఎనిమిదో సారి ఆసియా కప్ గెలవాలని, విశ్వవేదికపై భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడాలంటూ రోహిత్ అభిమానుల్లో ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇక వీడియోలో రోహిత్ క్రీజులో కాలుదువ్వుతూ కనిపించగా.. పాకిస్థాన్ షాహిన్ షా అఫ్రిది బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దీనికి రోహిత్ వాయిస్ ఓవర్ జత చేస్తూ రూపొందించిన ఈ ప్రొమో అభిమానులను ఆకట్టుకుంటుంది.
స్టార్ స్పోర్ట్స్ ఇటీవలే రోహిత్ను హైలైట్ చేస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో హిట్మ్యాన్.. 140 కోట్ల మంది భారత అభిమానులు ''ఇండియా.. ఇండియా'' అని ముక్తకంఠంతో నినదిస్తుంటే వినడం కంటే గొప్ప అనుభూతి ఉండదని, ఆసియా కప్లో త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడిద్దాం రమ్మని అభిమానులకు పిలుపునిచ్చాడు. ఇదిలా ఉంటే, తాజాగా విండీస్తో ముగిసిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ పర్యటన అనంతరం భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుండగా.. సీనియర్ ఆటగాళ్లంతా రెస్ట్ తీసుకోనున్నారు. మళ్లీ ఆసియాకప్తోనే బరిలోకి దిగనున్నారు. శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియాకప్ను దూబాయ్ వేదికగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈసారి ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.