ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుపు క్రెడిట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ది కాదని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా వెల్లడించాడు. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో కలిసి తాను నిర్మించిన జట్టుతోనే ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ 2024 విజయాలు సాధ్యమయ్యాయని స్పష్టం చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి అనంతరమే భిన్నంగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నామని హిట్ మ్యాన్ తెలిపాడు.
టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనతో రోహిత్ శర్మ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఈ పర్యటనలో రోహిత్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన సెలెక్టర్లు.. శుభ్మన్ గిల్ను నయా సారథిగా ఎంపిక చేశారు.

కెప్టెన్సీ మార్పు తర్వాత మౌనంగా ఉన్న రోహిత్ శర్మ తాజాగా జరిగిన CEAT క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడుతానని స్పష్టం చేశాడు. కెప్టెన్సీ మార్పుపై స్పందించేందుకు మాత్రం నిరాకరించాడు. వన్డే ప్రపంచకప్ 2023 పరాజయం అనంతరం రాహుల్ ద్రవిడ్తో కలిసి జట్టులో కొత్త సంస్కృతిని తీసుకొచ్చానని తెలిపాడు.
'భారత జట్టు అంటే నాకు చాలా ఇష్టం. ఈ జట్టుతో నేను సుదీర్ఘం కాలం ప్రయాణం చేశాను. భారత జట్టుతో నా ప్రయాణం ఒకటి రెండేళ్లు కాదు. చాలా ఏళ్లుగా జట్టుతో కలిసి ఆడాను. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ట్రోఫీకి మేం చాలా సార్లు చేరువయ్యాం. కానీ చివరి నిమిషంలో అందుకోలేకపోయాం. అప్పుడే మేం ఇంకా భిన్నంగా చేయాలని, రాణించాలని నిర్ణయించుకున్నాం. ఇందుకు రెండు మార్గాలు ఉన్నాయని గ్రహించాం.
టైటిల్ గెలవాలనే కసిని ఎప్పుడూ మదిలో ఉంచుకోవడం, ఒకరిద్దరూ కాకుండా జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ఈ విషయాన్ని ఆచరణలో పెట్టాలనుకున్నాం. ఇందుకు ఆటగాళ్లంతా ఆమోదం తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగిన ఆటగాళ్లంతా మ్యాచ్లు ఎలా గెలవాలి? మనల్ని మనం ఎలా సవాల్ చేసుకోవాలి? ఏ మాత్రం సంతృప్తి పడకుండా, ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దనే ఆలోచనతో ఆడారు. కెప్టెన్, కోచ్గా జట్టులో మేం తీసుకురావడానికి ప్రయత్నించిన లక్షణాలు ఇవే.
వాటినే పదే పదే చేయడం ఒక మంచి పద్దతి అవుతుందని మేం భావించాం. ఆ ప్రక్రియను అందరూ ఆస్వాదించారు. తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత మేం ఆ విజయాన్ని పూర్తిగా మరిచి.. తదుపరి మ్యాచ్పై ఫోకస్ పెట్టడం ప్రారంభించాం. జట్టులోని గొప్ప విషయం ఇది. టీ20 ప్రపంచకప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నేను , రాహుల్ భాయ్ ప్రణాళికలు వేస్తున్నప్పుడు ఈ పద్దతి మాకు సహాయపడింది. మేం ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాం. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో మేం గెలవకపోయినా.. ఒక జట్టుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాం. అందరూ మా ఆలోచనను ఆచరించారు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. గౌతమ్ గంభీర్ అతని వారసుడిగా బాధ్యతలు చేపట్టాడు. అతని పర్యవేక్షణలో టెస్ట్ల్లో ఘోర పరాజయాలను ఎదుర్కొన్న టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మాత్రం విజేతగా నిలిచింది. కోహ్లీ, రోహిత్ తప్పుకున్నా వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఈ విజయాల క్రెడిట్ గంభీర్దేనని అంతా అనుకుంటున్నారు. కానీ రోహిత్ మాత్రం తమ కష్టం వల్లే జట్టు ఈ స్థాయికి చేరిందని పరోక్షంగా స్పష్టం చేశాడు.