ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ దుమ్మురేపాడు. 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన రోహిత్.. తొలి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగాడు. గ్రూప్ సీలో భాగంగా సిక్కింతో బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. 61 బంతుల్లో శతకం సాధించాడు.
ఇందులో 80 పరుగులు(8 ఫోర్లు, 8 సిక్స్లతో) బౌండరీల ద్వారానే సాధించడం విశేషం. రోహిత్ శర్మకు ఇది 37వ లిస్ట్ ఏ సెంచరీ కాగా.. కెరీర్లో ఫాస్టెస్ట్ లిస్ట్-ఏ శతకం. 38 ఏళ్ల వయసులోనూ రోహిత్ తనదైన శైలిలో చెలరేగాడు.
రోహిత్ చివరిసారిగా 2018 అక్టోబర్లో విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. హైదరాబాద్తో సెమీఫైనల్లో బరిలోకి దిగాడు. మళ్లీ ఇన్నాళ్లకు విజయ్ హజారే ట్రోఫీ ఆడిన రోహిత్.. సిక్కింతో తొలి మ్యాచ్లోనే శతకం సాధించాడు. 17 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ కొట్టాడు. అతను చివరిసారిగా 2008లో గుజరాత్పై 115 పరుగులతో అజేయంగా నిలిచాడు.

రోహిత్(94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్స్లతో 155) భారీ శతకంతో ఈ మ్యాచ్లో ముంబై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 236 పరుగులు చేసింది. అశిష్ తాపా(79) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ముంబై 30.3 ఓవర్లలో 2 వికెట్లకు 237 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మతో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(38) రాణించాడు.
అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ నయా రూల్స్ నేపథ్యంలో రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరూ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా జరుగుతుండగా.. రోహిత్ను చూసేందుకు వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. మరోవైపు ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ కూడా ఆంధ్ర జట్టుపై హాఫ్ సెంచరీతో రాణించాడు.