భారత కామెంటేటర్లపై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పనిగట్టుకొని మరి ఆటగాళ్లపై విమర్శలు గుప్పిస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో కామెంట్రీ ఒక స్థాయిలో ఉంటే.. భారత్లో మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందని మండిపడ్డాడు. టెస్ట్ క్రికెట్కు రోహిత్ శర్మ బుధవారం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
భారత కామెంటేటర్లు తమ తీరును మార్చుకోవాలని సూచించాడు. భారత్లో స్పోర్ట్స్ జర్నలిజం మారాల్సిన అవసరం ఉందన్నాడు. 'ఆస్ట్రేలియాలో కామెంట్రీ ఒక స్థాయిలో ఉంటే భారత్లో మాత్రం భిన్నంగా ఉంది. భారత వ్యాఖ్యాతలు ఒక ఆటగాడిని ఎంచుకొని అతని గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్నారు. గతంలో నాణ్యమైన క్రికెట్ గురించే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఓ ఎజెండాతో కామెంట్రీ చెబుతున్నారు.

చాలా నిరుత్సాహంగా ఉంది..
ప్రస్తుతం టీవీల్లో కామెంట్రీ వింటుంటే చాలా నిరుత్సాహంగా అనిపిస్తోంది. ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ కామెంట్రీ చెబుతున్నారు. చాలా మంది అభిమానులు క్రికెట్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. నిజమైన క్రికెట్ ప్రేమికులకు మసాలా అవసరం లేదు. ఓ ఆటగాడు ఎందుకు ఫామ్ కోల్పోయాడు. ఏం తప్పులు చేశాడు? అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తాడు. కామెంటేర్లు ఆటగాళ్లకు కాస్త గౌరవం ఇవ్వాలి. కొన్నిసార్లు సరైన ప్రదర్శన చేయకపోవచ్చు. అప్పుడు ఆటగాళ్లు విమర్శలకు అర్హులే. న్యూజిలాండ్తో మేం సరిగ్గా ఆడలేదు. కానీ, విమర్శలకు కూడా ఓ విధానం ఉంటుంది. అంతేకానీ ఒక ఎజెండాతో విమర్శలు చేయవద్దు. అది ఎవరికీ నచ్చదు.
జర్నలిజం కూడా మారాలి..
భారత్లో జర్నలిజం కూడా మారాల్సిన అవసరం ఉంది. కొంతమంది కేవలం వివాదాలను సృష్టించడంపైనే దృష్టి పెట్టారు. అసలైన వార్తలను గాలికొదిలేసారు. దాంతో నాణ్యమైన జర్నలిజం తగ్గిపోతుంది. గతంలో క్రికెట్ చుట్టూ సంభాషణ జరిగేది. కానీ ఇప్పుడు మ్యూస్, లైక్స్ కోసం అనేక వివాదాలను తెరపైకి తీసుకొస్తున్నారు. దాంతో ఆట గురించి మాట్లాడటం, రాయడం తక్కువైంది. ఆటకు సంబంధించిన విశ్లేషణలే కనిపించడం లేదు. నాపై చాలా విమర్శలు ఉన్నాయి. కానీ నేను వాటిని అస్సలు పట్టించుకోను. లెఫ్టార్మ్ బౌలర్లను ఆడలేనని నాపై ఓ ముద్ర వేసారు. అయినా ఏ రోజు ఈ విమర్శలపై నేను ఫోకస్ పెట్టలేదు. నేను 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నాను.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.