
అడిలైడ్: సీనియర్ పేసర్ మహమ్మద్ షమీపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకంత బద్దకం అంటూ కస్సుమన్నాడు. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న కీలక సెమీస్లో బౌండరీ లైన్ వద్ద మహమ్మద్ షమీ ఘోర తప్పిదం చేశాడు. దాంతో ఇంగ్లండ్ అదనంగా రెండు పరుగులు రావడంతో తీవ్ర అసహనానికి గురైన రోహిత్.. నోరుపారేసుకున్నాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా హార్దిక్ పాండ్యా వేసిన 9వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని హార్దిక్ లెంగ్త్ బాల్గా వేయగా.. బట్లర్ ఫైన్ లెగ్ వైపు ఆడాడు. ఆ దిశలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మహమ్మద్ షమీ.. బంతిని అద్భుతంగా ఆపాడు. కానీ బంతిని కీపర్ వైపు విసరకుండా బంతి కోసం వచ్చిన భువనేశ్వర్ కుమార్కు అందించే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతనికి అందకుండా వెళ్లడంతో ఇంగ్లండ్కు నాలుగు పరుగులు వచ్చాయి. దాంతో బౌలర్ హార్దిక్ పాండ్యాతో పాటు మైదానంలో ఉన్న ఆటగాళ్లు, టీవీల ముందున్న ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
రోహిత్ తన అసహనాన్ని ఆపుకోలేక నోరు పారేసుకున్నాడు. నువ్వే బంతి ఇవ్వవచ్చు కదా? అని గట్టిగా అరుస్తూ షమీని మందలించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్..10 ఓవర్లలో 100కు పైగా పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్తోంది. అలెక్స్ హెల్స్ ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. బట్లర్ అతనికి సహకరిస్తున్నాడు. ఈ ఇద్దరి ధాటికి టీమిండియా బౌలర్లు తేలిపోయారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 63), విరాట్ కోహ్లీ(40 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్ తలో వికెట్ తీసారు.