టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకడం తన తండ్రి గురునాథ్ శర్మ నచ్చలేదని, తీవ్ర నిరాశకు గురయ్యాడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తన తండ్రికి రెడ్ బాల్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని, టీ20 ఫార్మాట్ అంటే అస్సలు నచ్చదని తెలిపాడు. ఇటీవలే రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. సెలెక్టర్ల సూచనలతోనే రోహిత్ శర్మ.. టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా సతీమణి పూజ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా తండ్రి నేను టెస్ట్ క్రికెట్ ఆడటం ఎక్కువగా చూశారు. వాస్తవానికి ఆయనకు రెడ్ బాల్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే నేను టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. కానీ అదే సమయంలో నా సక్సెస్ఫుల్ కెరీర్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నేను ఈ స్థాయికి చేరడానికి నా తండ్రి ఎంతో కృషి చేశారు. ఆయన లేకుండా నేను ఈ స్థాయికి చేరేవాడిని కాదు.

మొదటి నుంచి ఆయన టెస్ట్ క్రికెట్కు పెద్ద అభిమాని. ఆయనకు ఈ కొత్త తరం క్రికెట్(పరిమిత ఓవర్ల) అస్సలు నచ్చదు. వన్డేల్లో 264 పరుగులు చేసిన రోజు మా నాన్న నాతో అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. 'బాగా ఆడావు'అనే ఒక మాట మాత్రమే అన్నాడు. ఆయనలో ఎలాంటి ఉత్సాహం కనిపించలేదు.'అని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మ 67 మ్యాచ్లు ఆడి 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలతో పాటు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.