టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో అభిమానులకు ఊరట కలిగించే వార్త. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్ మ్యాన్.. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతనితో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఈ ఇద్దరూ.. వన్డే ప్రపంచకప్ 2027 వరకు జట్టులో కొనసాగడం కష్టమని, వారి భవిష్యత్తుపై త్వరలోనే మాట్లాడుతామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అనంతరం రోహిత్, కోహ్లీలు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. వన్డే ప్రపంచకప్ సమయానికి రోహిత్ 40, కోహ్లీ 38 ఏళ్లకు చేరుకుంటారని, ఆ వయసులో వారు జట్టులో కొనసాగుతూ మునపటిలా ఆడటం కష్టమనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే ఈ వార్తలను, ప్రచారాలను పటా పంచల్ చేస్తూ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా కీలక పోస్ట్ పంచుకున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే తన లక్ష్యమని ఆ పోస్ట్తో పరోక్షంగా స్పష్టం చేశాడు.

రోహిత్ శర్మ మంగళవారం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో కలిసి ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాడు. ఐపీఎల్ తర్వాత రోహిత్.. పూర్తిగా కుటుంబానికి పరిమితమయ్యాడు. దాంతోనే తన వ్యక్తిగత కోచ్ అయిన అభిషేక్ నాయర్తో కలిసి జిమ్లో కసరత్తులు చేయడం ప్రారంభించాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోను రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. ఈ పోస్ట్పై ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. 'ఎవడ్రా.. రిటైర్మెంట్ అన్నది'అని ప్రశ్నిస్తున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ గెలిచి సగర్వంగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 32 సెంచరీలు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ గెలవడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.