లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఓడినా ఆఖరి వరకు తల ఎత్తుకునేలా పోరాడమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మెగా ఫైనల్లో సమష్టిగా విఫలమైన టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో ఐసీసీ టైటిళ్లు అన్ని గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించగా.. టీమిండియా మరోసారి ఐసీసీ టైటిల్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది.
మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన కనబర్చిందని కొనియాడాడు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ తమ పతనాన్ని శాసించారని తెలిపాడు.

'ఈ ఓటమి చాలా నిరాశకు గురిచేసింది. వాస్తవానికి ఈ మ్యాచ్ను మేం అద్భుతంగా ప్రారంభించాం. టాస్ గెలిచి మా కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆసీస్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాం. తొలి సెషన్లో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. ఆ తర్వాత చేతులెత్తేసాం. ఆస్ట్రేలియా బ్యాటర్లు అద్భుతంగా ఆడటంతో మేం వెనుక పడ్డాం.
ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అసాధారణ బ్యాటింగ్తో చెలరేగాడు. స్మిత్తో కలిసి అద్భుత భాగస్వామ్యంతో మా విజయవకాశాలను దెబ్బతీసాడు. ఆ పరిస్థితుల్లో నుంచి పుంజుకోవడం కష్టమని మాకు తెలుసు. అయినా మేం మా పోరాటాన్ని ఆపలేదు. చివరి వరకు పోరాడాం. కానీ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. డబ్ల్యూటీసీ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు నా అభినందనలు.
మేం చాలా వ్యూహాలతో ఈ మ్యాచ్ బరిలోకి దిగాం. కానీ అవి వర్కౌట్ కాలేదు. టైట్గా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ కుదరలేదు. రహానే, శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 150/5 పరిస్థితుల్లో సూపర్ బ్యాటింగ్తో జట్టును రేసులో నిలబెట్టారు. రెండో ఇన్నింగ్స్లోనూ మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. కానీ బ్యాటింగ్లో మళ్లీ విఫలమయ్యాం.
బ్యాటింగ్ చేసేందుకు ఈ పిచ్ చాలా అనుకూలంగా ఉంది. ఐదు రోజుల పాటు పిచ్ ఒకేలా ఉంది. కానీ మేం ఈ పరిస్థితులను అందిపుచ్చుకోలేకపోయాం. గత నాలుగేళ్లు మేం చాలా కష్టపడి రెండు సార్లు ఫైనల్ చేరాం. కానీ టైటిల్ గెలవకపోవడమే మమ్మల్ని నిరాశపరిచే అంశమే. మేం ఈసారైనా మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. తదుపరి ఛాంపియన్ షిప్ కోసం కూడా మేం ఇలానే పోరాడుతాం. అభిమానుల నుంచి మాకు అద్భుతమైన మద్దతు లభించింది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), అంజిక్యా రహానే(108 బంతుల్లో 7 ఫోర్లతో 46), రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్కు రెండు వికెట్లు దక్కగా.. ప్యాట్ కమిన్స్కు ఓ వికెట్ దక్కింది.