Rohit Sharma, IND vs NZ World Cup 2023 Semi final: టీమిండియా తొలిసారి ప్రపంచకప్ గెలిచినప్పుడు తమ జట్టులోని ఒక్క ఆటగాడు కూడా పుట్టలేదని, రెండో సారి ఛాంపియన్గా నిలిచినప్పుడు జట్టులోని సగం మంది ఆటనే మొదలుపెట్టలేదని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం న్యూజిలాండ్తో జరగనున్న సెమీఫైనల్లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గత విజయాలు, పరాజయాలు తమకు అనవసరమని స్పష్టం చేశాడు. భారత్లో ఆడుతున్నప్పుడు ఒత్తిడి సహజమని, కెప్టెన్గా తన సక్సెస్ వెనుక మంత్రం ఏం లేదన్నాడు.

'అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. తొలి గేమ్ నుంచి చివరి వరకు.. ఎక్కడ ప్రపంచకప్ మ్యాచ్ ఆడినా ఒత్తిడి ఉండటం సహజం. కానీ మేం ఒత్తిడిని అద్భుతంగా హ్యాండిల్ చేశాం. అదే జోరును నాకౌట్ మ్యాచ్ల్లోనూ కొనసాగించాలనుకుంటున్నాం. భారత్లో ఎప్పుడు మ్యాచ్ ఆడినా ఒత్తిడి ఉంటుంది. మేం మా మ్యాచ్పైనే ఫోకస్ పెట్టాలనుకుంటున్నాం.'అని ఒత్తిడి గురించి అడిగిన ప్రశ్నకు రోహిత్ బదులిచ్చాడు.
ఆరో బౌలింగ్ ఆప్షన్పై స్పందిస్తూ.. 'హార్దిక్ పాండ్యా గాయపడటంతో టీమ్ కాంబినేషన్లో మార్పులు చేయాల్సి వచ్చింది. తొలి గేమ్ నుంచి మా బౌలర్లు సత్తా చాటారు. బౌలింగ్ ఆప్షన్స్ ఉండటం చాలా మంచిది. కానీ ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉపయోగించుకునే పరిస్థితి మాకు రాలేదు. తదుపరి మ్యాచ్ల్లోనూ ఆరో బౌలింగ్ ఆప్షన్ అవసరం రాదనే కోరుకుంటున్నా.'అని రోహిత్ బదులిచ్చాడు.
'గొప్ప విషయం ఏంటంటే.. టీమిండియా 1983 ప్రపంచకప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లు ఒక్కరు కూడా పుట్టలేదు. 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులోని సగం మంది కెరీరే ప్రారంభించలేదు. మా సీనియర్ ఆటగాళ్లు ప్రపంచకప్ ఎలా గెలిచామో చెప్పడం నేను అయితే వినలేదు. జట్టుగా మెరుగవ్వడంపైనే మా ఫోకస్ ఉంది. అదే మా ఆటగాళ్ల గొప్పతనం. తొలి గేమ్ నుంచి గెలుపుపైనే మా ఫోకస్ ఉంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇక టీమ్ వాతావరణం అద్భుతంగా ఉందని, ఒకరిద్దరి ప్రదర్శనపై ఆధారపడకుండా సమష్టిగా సత్తా చాటాలనుకున్నామని రోహిత్ తెలిపాడు. సపోర్ట్ స్టాఫ్ నుంచి జట్టులో ప్రతీ ఒక్కరు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని ప్రశంసించాడు. టీమ్ వాతావరణం బాగుండటానికి కావాల్సినవన్నీ చేస్తున్నామని తెలిపాడు.