Rohit Sharma, World Cup 2023 Final: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసమైనా వన్డే ప్రపంచకప్ టైటిల్ సాధిస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ మైదానం వేదికగా జరిగే టైటిల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ బిగ్ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ విజయాల వెనుక హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అసాధారణ పాత్ర ఉందని తెలిపాడు. జట్టులోని ఆటగాళ్లకు స్పష్టమైన రోల్స్ అదించారని కొనియాడాడు. కనీసం అతని కోసమైనా టైటిల్ గెలిచి తీరుతామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

'హెడ్ కోచ్గా జట్టు విజయాల్లో రాహుల్ ద్రవిడ్ పాత్ర చాలా పెద్దది. ఆటగాళ్లను తమ బాధ్యతలు నెరవేర్చేలా సన్నద్ధం చేయడంతో పాటు, ఆ దిశగా వారికి స్వేచ్ఛ, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పించడంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించారు.
కఠిన సమయాల్లోనూ ఆటగాళ్లకు అండగా నిలిచాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ 2022లో సెమీఫైనల్లో ఓడినప్పుడు అతను మాట్లాడిని మాటలు.. ప్రోత్సహించిన తీరు మాకు ఎంతో ఉపయోగపడింది. నేను, ద్రవిడ్ జట్టులో మంచి వాతావరణం సృష్టించాం. దాని పట్ల ఎంతో సంతృప్తి చెందుతున్నా. బయటి చికాకులు ఆటగాళ్ల దరి చేరని విధంగా చర్యలు తీసుకున్నాం.
ఆటగాళ్లు ఈ వాతావరణంలో చక్కగా ఇమిడిపోతున్నారు. ఆటగాళ్ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అది వారి ప్రదర్శనపై సానుకూల ప్రభావం చూపుతోంది. ప్రపంచకప్ విజయంలో ద్రవిడ్ భాగం కావాలనుకుంటున్నాడు. మేం కూడా అతని కోసం విజయం సాధించాలనుకుంటున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇదే ఆస్ట్రేలియాతో 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోగా.. ఆ జట్టులో రాహుల్ ద్రవిడ్ ఆటగాడిగా ఉన్నాడు. ప్లేయర్గా సాధించని ప్రపంచకప్ను కోచ్గా సాధించాలని ద్రవిడ్ ఆశిస్తున్నాడు. టీమ్ ప్లేయర్లు కూడా అతని కోరికను తీర్చాలనుకుంటున్నారు.
ఇక ప్రపంచకప్ ఫైనల్ ఆడిన అనుభవం ఆస్ట్రేలియాకు అడ్వాంటేజ్గా మారుతుందని తాను అనుకోవడం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. 'ఆస్ట్రేలియా జట్టులో 2015 ప్రపంచకప్ ఫైనల్ ఆడిన ఆటగాళ్లు ఉండటం వారికి అడ్వాంటేజ్ అవుతుందని నేను అనుకోవడం లేదు. 8 ఏళ్ల తర్వాత ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అలా అంటే మా జట్టులో కూడా 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడిన విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.
ప్రపంచకప్ ఫైనల్ పిచ్ స్లోగా ఉండే అవకాశం ఉంది. భారత్ -పాకిస్థాన్ మ్యాచ్కు ఉపయోగించిన పిచ్పై గ్రాస్ లేదు. కానీ ఈ వికెట్పై గ్రాస్ను వదిలేసారు. బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్లను చూస్తూ పెరిగిన తనకు ఈ మెగా ఫైనల్ ఆడటం చాలా ప్రత్యేకమని రోహిత్ శర్మ తెలిపాడు.