
న్యూఢిల్లీ: గతేడాది టీ20 ప్రపంచకప్ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తీరికలేని షెడ్యూల్ కారణంగా ఆ టోర్నీలో ఆటగాళ్లు విఫలమయ్యారనేది వాస్తవమని, అందుకే బెంచ్ బలాన్ని పెంచుకుంటున్నామని తెలిపాడు. గతేడాది ప్రపంచకప్లో పాకిస్థాన్తో చిత్తుగా ఓడిన భారత్.. న్యూజిలాండ్తో పరాజయంపాలై సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి తప్పిదాలను మళ్లీ పునరావృతం కావద్దనే ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్మెంట్పై కేర్ తీసుకుంటున్నామని రోహిత్ తెలిపాడు.
స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. 'మేము చాలా ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్నాం. కాబట్టి ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్బాల్లో ఆటలో తీరికలేని కారణంగా విశ్రాంతి అవసరం. ఇలాంటి సమయాల్లో రిజర్వ్ బెంచ్ బలంగా ఉండటం ముఖ్యం. వారికి ఛాన్స్లు ఇస్తూ ఉండటం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్ల ప్రదర్శన మెరుగవుతుంది. తద్వారా భారత్ క్రికెట్ను సురక్షితమైన చేతుల్లో పెట్టవచ్చు.
ఈ ప్రణాళికతోనే ఆటగాళ్ల రొటేషన్ జరుగుతుంది. గెలుపోటములు ముఖ్యం కాదు. మేం ఒక జట్టుగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తాం. మేమంతా కలిసి రాణిస్తేనే జట్టు విజయానికి తోడ్పడగలం. ఆ దిశగానే పనిచేస్తున్నాం. ద్రవిడ్ సార్ భారత జట్టు కోచ్గా వచ్చినప్పుడు, అతనితో జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే దానిపై మాట్లాడాను. అతను నాలాంటి ఆలోచనా విధానంతోనే ఉన్నాడు. దీంతో జట్టును నడిపించడం నాకు సులభమవుతోంది. జట్టు ఒకే దిశలో పయనించడానికి కోచ్, కెప్టెన్ల మధ్య ఒక స్పష్టమైన వైఖరి ఉండాలి.
మేం నిర్ణయించుకున్న విషయం ఏమిటంటే.. జట్టులో ఎటువంటి గందరగోళాన్ని సృష్టించకుండా మంచి ఫలితాలను రాబట్టాలి. టీమ్ఇండియా ఆడే శైలిని ఫార్మాట్కు అనుగుణంగా మార్చాలనుకుంటున్నాం. మూడు ఫార్మాట్లను ఒక నిర్దిష్ట మార్గంలో ఆడాలనుకుంటున్నాం' అని రోహిత్ తెలిపాడు.