వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోకపోవడంతోనే ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్లో ఘోర పరాజయం చవిచూశామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ మ్యాచ్లో తమ జట్టు సమష్టిగా విఫలమైందని అంగీకరించాడు. మరోవైపు ఆస్ట్రేలియా అసాధారణ ప్రదర్శనతో విజయాన్ని సొంతం చేసుకుందని కొనియాడాడు.
అడిలైడ్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో సమష్టి ప్రదర్శనతో 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా.. పింక్ బాల్ టెస్ట్లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్లో తేలిపోయింది. పింక్ బాల్ అనుభవలేమి టీమిండియా కొంపముంచింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం స్పందించిన రోహిత్ శర్మ.. ఈ వారం తమకు నిరాశను మిగిల్చిందని చెప్పాడు. 'ఈ వారం మాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ మ్యాచ్లో విజయానికి కావాల్సిన ప్రదర్శనను మేం చేయలేదు. మా కంటే ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్లో మాకు దక్కిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాం. అదే మా ఓటమిని శాసించింది.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో మా ప్రదర్శన చాలా ప్రత్యేకం. ఈ మ్యాచ్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనుకున్నాం. కానీ ప్రతీ టెస్ట్ మ్యాచ్ ఓ సవాల్ను విసురుతోంది. పింక్ బాల్తో ఆడటం సవాల్తో కూడుకున్న విషయమని మాకు తెలుసు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మా కంటే మెరుగ్గా ఆడింది.
మేం తదుపరి మ్యాచ్పై ఫోకస్ పెట్టాం. ఆ మ్యాచ్కు పెద్దగా సమయం కూడా లేదు. వీలైనంత త్వరగా అక్కడికి వెళ్లి.. పెర్త్ టెస్ట్లో మేం చేసిన ప్రదర్శనపై ఆలోచన చేస్తాం. అలాగే గతంలో గబ్బా వేదికగా సాధించిన విజయాన్ని నెమరువేసుకుంటాం. ఇక్కడ మాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్లో ఎదురయ్యే సవాళ్లను మేం అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. ఆ మ్యాచ్లో శుభారంభం చేసి మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 180 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో ఆ జట్టుకు 157 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 175 పరుగులకు ఆలౌటవ్వగా.. 19 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సునాయసంగా చేధించింది. డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.