అహ్మదాబాద్: డెత్ బౌలింగ్ వైఫల్యంతో పాటు చెత్త బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 55 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రోహిత్.. ఈ రోజు తమకు కలిసిరాలేదన్నాడు. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందని, ఒక్కరు క్రీజులో నిలబడినా విజయం దక్కేదన్నాడు.
'ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. మ్యాచ్పై పట్టుబిగించిన మేం చివరి ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చుకున్నాం. ప్రతీ జట్టు విభిన్నమైన బలాలను కలిగి ఉన్నాయి. మాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఈ లక్ష్యాన్ని సునాయసంగా చేధించగల సత్తా మాకు ఉంది. కానీ ఈ రోజు మాకు కలిసి రాలేదు. కొంచెం డ్యూ ఉన్న నేపథ్యంలో ఒకరు చివరి వరకు బ్యాటింగ్ చేయాల్సింది.

గత మ్యాచ్లో 215 పరుగుల భారీ లక్ష్య చేధనలో దాదాపు దగ్గర వరకు వచ్చాం. కానీ ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాం. 200+ లక్ష్యాన్ని చేధించేటప్పుడు శుభారంభం ముఖ్యం. కానీ ఈ మ్యాచ్లో అది దక్కలేదు. చివరి ఏడు ఓవర్లలో బ్యాటింగ్ చేసేందుకు కూడా మాకు కావాల్సిన బ్యాటర్లు క్రీజులో లేకపోయారు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవిడ్ మిల్లర్(22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 46), అభినవ్ మనోహర్(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42), రాహుల్ తేవాడియా(5 బంతుల్లో 3 సిక్సర్లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్, జాసన్ బెహ్రాండార్ఫ్, రిలే మెరిడిత్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులే చేసి ఓటమిపాలైంది. నెహాల్ వదేరా(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 40), కామెరూన్ గ్రీన్(26 బంతుల్లో 3 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యాకు ఓ వికెట్ దక్కింది.