
చెన్నై: బ్యాటింగ్ వైఫల్యంతోనే ఆస్ట్రేలియాతో ఆఖరి వన్డేలో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఆసీస్ విధించిన లక్ష్యం ఏం గొప్పది కాదని, భాగస్వామ్యాలు నెలకొల్పడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని తెలిపాడు. బుధవారం చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ.. ఒక్క బ్యాటర్ కడవరకు నిలిచినా ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. ఇది సమష్టి వైఫల్యమని, తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుంటామని తెలిపాడు.
'ఇదేం గొప్ప లక్ష్యం కాదు. మేమే సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. చేజింగ్లో భాగస్వామ్యాలు చాలా కీలకం. ఈ రోజు మేం పార్ట్నర్షిప్స్ నమోదు చేయలేకపోయాం. ఈ తరహా వికెట్లపై ఆడుతూ పెరిగిన మేం.. బేసిక్ రూల్స్ పాటించలేదు. మంచి ఆరంభం లభించిన తర్వాత.. ఒక బ్యాటర్ క్రీజులో నిలబడి వీలైనంత వరకు మ్యాచ్ను డీప్గా తీసుకెళ్లడం చాలా ముఖ్యం. కానీ అలా చేయలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీయడంతో పాటు మా బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది.
ప్రపంచకప్ సన్నాహకల్లో భాగంగా ఈ సిరీస్ కోల్పోయినా.. గత 9 వన్డేల్లో మాకు ఎన్నో సానుకూలంశాలు లభించాయి. ఈ ఓటమితో మేం ఎక్కడ మెరుగుపడాలో అనే విషయం తెలిసింది. ఇది సమష్టి వైఫల్యం. ఈ సిరీస్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆస్ట్రేలియా ప్లేయర్లు అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా ఆసీస్ స్పిన్నర్లు ఇద్దరూ మాపై ఒత్తిడి పెంచారు. పేసర్లు సైతం అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ విజయానికి వారు పూర్తి అర్హులు'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 33), మిచెల్ మార్ష్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 47), అలెక్స్ క్యారీ(46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/44), కుల్దీప్ యాదవ్(3/56) మూడేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/57), మహమ్మద్ సిరాజ్(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిటిన టీమిండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ(72 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 54), హార్దిక్ పాండ్యా(40 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 40)రాణించినా ఫలితం లేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా(4/45) నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. అష్టన్ అగర్ రెండు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు.