పేలవ బ్యాటింగే తమ ఓటమిని శాసించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. న్యూజిలాండ్తో పుణె వేదికగా జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా 113 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో మూడు టెస్ట్ల సిరీస్ను 0-2తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కోల్పోయింది.
న్యూజిలాండ్ మాత్రం భారత్ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ విజయాన్నందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. మరోవైపు టీమిండియా మాత్రం 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయింది. రెండో టెస్ట్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ తమకంటే మెరుగైన ప్రదర్శన చేసిందని ప్రశంసించాడు.

'ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది మేం ఏ మాత్రం ఊహించని ఫలితం. న్యూజిలాండ్ మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్లో ఎదురైన సవాళ్లను అధిగమించడంలో మేం విఫలమయ్యాం. దాంతోనే ఓటమిపాలయ్యాం. బ్యాటింగ్లో మేం మెరుగైన ప్రదర్శన చేయలేదు. స్కోర్ బోర్డపై కావాల్సిన పరుగులు ఉంచలేదు. బౌలర్లు 20 వికెట్లు తీయాలంటే... బ్యాటర్లు కూడా బోర్డుపై కావాల్సిన పరుగులు పెట్టాలి.
ఈ విషయంలో మేం విఫలమయ్యాం. తొలి ఇన్నింగ్స్లో 100 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్నాం. ఇలాంటి పరిస్థితుల నుంచి పుంజుకునేందుకు మేం పోరాడాం. కానీ ఇది ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈ లక్ష్యాన్ని మేం చేధించాలనుకున్నాం. కానీ ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కోలేకపోయాం. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను 200/3 నుంచి 259 పరుగులకే పరిమితం చేయడం గొప్ప విషయం.
ఈ మ్యాచ్లో ఉన్నట్లుగా ఉండే పిచ్ ఏ మాత్రం కాదు ఇది. కానీ మేం సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. న్యూజిలాండ్ మా కంటే మెరుగ్గా ఆడింది. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ గురించి ఆలోచించడం లేదు. వాంఖడే టెస్ట్ గెలవాలనుకుంటున్నాం. ఈ సిరీస్ ఓటమి సమష్టి వైఫల్యం. ప్రత్యర్థి విసిరిన సవాళ్లను స్వీకరించడంలో మా జట్టు విఫలమైంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్ విధించిన 359 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 60.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా(84 బంతుల్లో 2 ఫోర్లతో 42) పర్వాలేదనిపించాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(6/104) ఆరు వికెట్లతో మరోసారి భారత్ పతనాన్ని శాసించాడు. ఆజామ్ పటేల్కు రెండు వికెట్లు దక్కగా.. గ్లేన్ ఫిలిప్స్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులు చేయగా.. అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు కుప్పకూలింది. 103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. రెండో ఇన్నింగ్స్లో 255 పరుగులు చేసింది.