నాణ్యమైన క్రికెట్తో అందరినీ సంతోషపెడుతామని, ఈ విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్కు మాట ఇచ్చారు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా.. గురువారం ఆ దేశ ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్తో భేటీ అయ్యింది.
అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి జరిగే పింక్ బాల్ టెస్ట్కు ముందు భారత్.. నవంబర్ 30-డిసెంబక్ 1న ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్తో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్.. భారత ఆటగాళ్లకు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తమ ఆటతో అందర్నీ అలరిస్తామని తెలిపాడు.'భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ మాత్రమే కాకుండా ఇంతర అంశాల్లోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా మేం ఆసీస్ పర్యటనకు వస్తున్నాం. ఆస్ట్రేలియా జట్టు కూడా భారత్లో పర్యటిస్తోంది. ఇరు దేశాలు క్రికెట్ ఆడుతున్నాయి. ఆసీస్లోని విభిన్న సంప్రదాయాలను మేం ఆస్వాదిస్తున్నాం.
ఇక ఆసీస్లో ఆడటం ఎప్పుడూ కఠినమే. గతంలోనూ ఇక్కడ విజయాలు సాధించాం. ఈ సారి మా పర్యటనను విజయంతోనే ప్రారంభించాం. ఇదే జోరును సిరీస్ అసాంతం కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఆసీస్లోని విభిన్నమైన నగరాలకు వెళ్లడం మంచి అనుభవం. ఇక్కడకు వచ్చి ఆడేందుకు చాలా ఇష్టపడుతాం. ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులను అలరించడంలో ఏ మాత్రం వెనుకడుగు వేయం. క్రికెట్ను ఆదరించడంలో భారత్తో పాటు ఇక్కడి ఫ్యాన్స్ ఎప్పుడూ ముందుంటారు.
మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ సర్. నాణ్యమైన క్రికెట్తో మిమ్మల్ని అలరిస్తాం. ఇలాంటి గొప్ప ప్రదేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఇరు దేశాల క్రికెట్ పోటీని ఆస్వాదిస్తారని భావిస్తున్నాం.'అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా విజయం సాధించింది.