అహ్మదాబాద్: వామప్ మ్యాచ్లు రద్దయినందుకు ఎలాంటి బాధ లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ మ్యాచ్లు జరగకపోవడమే మంచిదైందని, జట్టులోని ఆటగాళ్లంతా సంతోషంగా ఉన్నారని చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో భారత్ ఆడాల్సిన రెండు వామప్ మ్యాచ్లు వర్షం కారణంగా బంతి కూడా పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే.
గౌహతి వేదికగా ఇంగ్లండ్తో, తిరువనంతపురం వేదిక నెదర్లాండ్స్తో జరగాల్సిన వామప్ మ్యాచ్లను వరణుడు మింగేసాడు. దాంతో టీమిండియా సన్నాహక మ్యాచ్లు లేకుండానే వరల్డ్ కప్ బరిలోకి దిగుతోంది. సరైన ప్రాక్టీస్ మ్యాచ్ లభించకపోవడంపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే రోహిత్ మాత్రం సంతోషం వ్యక్తం చేశాడు.

గురువారం నుంచి వన్డే ప్రపంచకప్ మొదలవ్వనుండగా.. బుధవారం కెప్టెన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 10 జట్ల కెప్టెన్లు హాజరై ట్రోఫీతో ఫొటోలకు ఫోజిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వామప్ మ్యాచ్లు రద్దవ్వడంపై ప్రశ్నించగా.. రోహిత్ శర్మ ఆసక్తికర సమాధానం చెప్పాడు.
'వామప్ మ్యాచ్లు రద్దు అయినందుకు సంతోషంగా ఉన్నాం. మ్యాచ్లు జరగకపోవడం వల్ల మాకు రెండు రోజుల విశ్రాంతి లభించింది. ఎందుకంటే విపరీతమైన వేడి మధ్య ఒక వైపు నుంచి మరోవైపు ప్రయాణించి మ్యాచ్ ఆడటం ఆశమాషి వ్యవహారం కాదు. అందుకే మ్యాచ్ రద్దవ్వడం మాకు మంచే చేసింది.'అని రోహిత్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
ఈ ప్రపంచకప్ గెలిచేందుకు తమ సాయశక్తులా కృషి చేస్తామని రోహిత్ స్పష్టం చేశాడు. 'ఈ ప్రపంచకప్ గెలిచేందుకు మా సాయశక్తులా కృషి చేస్తాం. గత మూడు టోర్నీల్లో హోస్టింగ్ దేశాలే విజయం సాధించాయి. అయితే ఈ విషయాలను మేం పట్టించుకోవడం లేదు. వాటి గురించి ఆలోచించడం లేదు. టోర్నీని ఆస్వాదిస్తూ మా సాయశక్తులా పోరాడాలని మాత్రమే అనుకుంటున్నాం.

మా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలనుకుంటున్నాం. మా నైపుణ్యాలకు తగ్గట్లు రాణించి విజయం సాధించాలనుకుంటున్నాం. భారత్ వేదికగా జరిగే ఈ ప్రపంచకప్ను అందరూ కెప్టెన్లు, ప్లేయర్లు ఆస్వాదిస్తారని హామీ ఇస్తున్నాను. కిక్కిరిసిన మైదానాల్లో వారికి వినూత్నమైన అనుభవం ఎదురు కానుంది.
ఆటగాళ్లకు తగిన స్వేచ్చనిచ్చి సరైన ప్లాట్ఫామ్ కల్పిస్తే వారి సత్తా మేరకు రాణిస్తారు. ఓ కెప్టెన్గా ఆటగాళ్లకు వారి సహజసిద్దంగా ఆడేలా స్వేచ్చను కల్పించడం ముఖ్యం. భారత్లో క్రికెట్ అనేది పెద్ద క్రీడ. ప్రపంచకప్ నేపథ్యంలో దేశంలో మొదలైన ఫీవర్.. అభిమానుల ఉత్సాహం నాకేం ఆశ్చర్యంగా లేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.