ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ సిరీస్లో తాము ఒక్క తప్పిదం కూడా చేయలేదు. అయితే జట్టుగా కొన్ని విషయాల్లో తాము మెరుగవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన భారత్ 142 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది.
నిరాశపర్చిన రోహిత్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్ (102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 112) శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52), శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 78) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్(4/64) నాలుగు వికెట్లు తీసాడు. రెండో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగిన రోహిత్ శర్మ(1).. ఈ మ్యాచ్లో మాత్రం రెండో బంతికే ఔటయ్యాడు.

తేలిపోయిన ఇంగ్లండ్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. టామ్ బాంటన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 38), గస్ అట్కిన్సన్(19 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
ఆ క్రెడిట్ బౌలర్దే..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. తన ఔట్ క్రెడిట్ బౌలర్దేనని తెలిపాడు. 'ఈ సిరీస్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్లో మాకు సవాళ్లు ఎదురవుతాయని తెలుసు. వాటిని ధీటుగా ఎదుర్కొన్నాం. ఈ మ్యాచ్లో నా వికెట్ క్రెడిట్ బౌలర్దే. బౌలర్ ఎప్పుడు ఔట్ చేయడానికి ఉంటాడు. కొన్నిసార్లు లక్కీగా బ్యాట్ను మిస్సవుతాయి. కానీ ఈ మ్యాచ్లో నేను రెండో బంతినే నిక్ చేశాను. దానికి నేనేం చేయలేను.
ఈ సిరీస్లో మేం తప్పిదం చేసినట్లు నేను చూడలేదు. మేం కొన్ని విషయాల్లో మెరుగవ్వాల్సి ఉంది. అయితే అవి ఏంటని ఇక్కడ నిలబడి నేను చెప్పలేను. జట్టులో నిలకడ తీసుకురావడం మా పని. ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ స్పష్టంగా ఉంది. ప్రతీ ఛాంపియన్ టీమ్ ప్రతీ గేమ్కు మెరుగవ్వాలనుకుంటుంది. అలానే ముందుకు సాగాలనుకుంటుంది. ఈ మ్యాచ్లో మేం చేసిన స్కోర్ సంతోషాన్నిచ్చింది. జట్టులో ఆటగాళ్లకు నచ్చినట్లు ఆడే స్వేచ్చ ఉంది. అందుకు వన్డే ప్రపంచకప్ సరైన ఉదాహరణ. ఆ సంప్రదాయాన్నే కొనసాగించాలనుకుంటున్నాం. 'అని రోహిత్ శర్మ తెలిపాడు.