Rohit Sharma, IND vs NED: సమష్టిగా ఆడటం, ఒకరి విజయాన్ని మరొకరు సెలెబ్రేట్ చేసుకోవడం, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని ఉత్సాహంగా ఉంచుతూ ఆటను ఆస్వాదించడం తమ విజయ రహస్యమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ టోర్నీలో 9 మ్యాచ్లకు 9 గెలిచిన టీమిండియా సరికొత్త రికార్డు నమోదు చేసింది. వన్డే ప్రపంచకప్ ఎడిషన్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రోహిత్ సేన నిలిచింది. 2003 వన్డే ప్రపంచకప్లో గంగూలీ సేన సాధించిన 8 వరుస విజయాల రికార్డ్ను అధిగమించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. సమష్టి ప్రదర్శనతో ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపాడు.

'ఈ టోర్నీ ప్రారంభమయ్యేటప్పుడు ఒక్కో మ్యాచ్ను గెలవడంపైనే ఫోకస్ పెట్టాం. సుదీర్ఘ టోర్నీ అని, 11 మ్యాచ్ ఆడాల్సి ఉంటుందనే విషయం మాకు తెలుసు. అంతేకాకుండా విభిన్న వేధికల్లో పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సి ఉందనే విషయాన్ని కూడా గ్రహించాం. అందుకు తగ్గట్లే రాణించి విజయాలు అందుకున్నాం. ఈ 9 మ్యాచ్ల్లో మేం ఆడిన తీరుపై చాలా సంతోషంగా ఉన్నాం. తొలి గేమ్ నుంచి తాజా మ్యాచ్ వరకు సమష్టిగా రాణించాం.
ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా.. ఒక్కో మ్యాచ్లో ఒక్కో ప్లేయర్ బాధ్యత తీసుకొని విజయంలో కీలక పాత్ర పోషించారు. విభిన్న వేదికల్లో ఆడటం సవాల్గా మారింది. కానీ మేం పరిస్థితులను చక్కగా అందిపుచ్చుకున్నాం. టోర్నీఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచ్లో చేజింగ్ చేసి గెలిచాం. ఆ తర్వాత బ్యాటింగ్ ఫస్ట్ చేయగా.. పేసర్లు స్పిన్నర్లతో కలిసి సత్తా చాటారు. డ్రెస్సింగ్ రూమ్ ఉత్సహంగా ఉండాలంటే విజయం సాధించడం ముఖ్యం.
భారత్లో ఆడుతున్నప్పుడు భారీ అంచనాలు ఉండటం సహజం. జట్టులో ప్రతీ ఒక్కరి సాన్నిహిత్యాన్ని మేం ఆస్వాదిస్తున్నాం. మైదానంలో ఆటను ఆస్వాదిస్తూ ఆడాలనుకుంటున్నాం. బయటి వాతావరణం ఉత్సహంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆరో బౌలింగ్ ఆప్షన్ మమ్మల్ని వెంటాడుతోంది.
జట్టులోనే ఆ ఆప్షన్ను క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఈ రోజు మాకు 9 బౌలింగ్ ఆప్షన్స్ లభించాయి. ప్రయోగాలు చేసేందుకు ఈ మ్యాచే సరైనదని మేం భావించాం. ఈ మ్యాచ్లో మా పేసర్లు అవసరం లేని వైడ్ యార్కర్లు బౌలింగ్ చేశారు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.