అహ్మదాబాద్: బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే ఈ అద్భుత విజయాన్ని అందుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో వన్డే ప్రపంచకప్లో టీమిండియా తమ ఆధిపత్యాన్ని 8-0గా మార్చింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. ఈ గెలుపుతో ఉప్పొంగిపోవడం లేదని, ఇది సుదీర్ఘ టోర్నీ అనే విషయం తమకు గుర్తు ఉందని తెలిపాడు. ఇంకా 6 మ్యాచ్లతో పాటు సెమీ ఫైనల్, ఫైనల్స్ ఆడాల్సి ఉందని, ఇదే జోరును కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.

'బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ప్రత్యర్థిని 190 పరుగులకే కట్టడి చేయడం అద్భుతం. ఓ దశలో పాకిస్థాన్ 280-290 పరుగులు చేస్తుందని అనుకున్నాం. కానీ బంతి అందుకున్న ప్రతీ బౌలర్ సత్తా చాటాడు. ఆరుగురు బౌలర్లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అందరూ ప్రతీ రోజు రాణించలేరు.
ఎవరికి కలిసొచ్చిన రోజున వారు చెలరేగుతారు. ఏ రోజు ఎవరూ బాగా రాణిస్తున్నారనేది గ్రహించి వారితో బౌలింగ్ చేయించడం కెప్టెన్గా నా బాధ్యత. జట్టులో ప్రతీ ఒక్కరికి వారి బాధ్యతపై స్పష్టత ఉంది. ఈ ప్రపంచకప్లో మేం ఏం చేయాలనే క్లారిటీతోనే బరిలోకి దిగాం. గత రికార్డులు, ఫలితాలు మాకు అనవసరం.
ప్రపంచకప్ గెలుపు కోసం మేం ఏం చేయాలో మాకు బాగా తెలుసు. బ్యాటర్లు, బౌలర్లు ఎవరికి అవకాశం లభిస్తే వారు విజయంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ విజయంతో మేం ఉప్పొంగిపోవడం లేదు. ఇది సుదీర్ఘ టోర్నీ అనే విషయం మాకు తెలుసు. ఇంకా చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉంది. టీమ్ సమతూకాన్ని కొనసాగిస్తూ.. ముందుకు సాగాలనుకుంటున్నాం.
ఇంతకుముందు నేను చెప్పినట్లు పాకిస్థాన్ మాకు ఓ ప్రత్యర్థి మాత్రమే. ఇతర జట్లలానే ఆ జట్టును ఓడించాలనుకున్నాం. గతం, భవిష్యత్తు మాకు అనవసరం. ప్రత్యర్థి ఎవరా? అనేది సంబంధం లేకుండా మ్యాచ్ రోజు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే మా లక్ష్యం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజామ్(58 బంతుల్లో 7 ఫోర్లతో 50), మహమ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 7 ఫోర్లతో 49) మినహా అంతా విఫలమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 86) తృటిలో శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. హసన్ అలీ ఓ వికెట్ తీసాడు.