ప్రణాళికలకు తగ్గట్లు రాణించడంతో పాటు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అసాధారణ బ్యాటింగ్ తమ విజయానికి కారణమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ విజయంలో బౌలర్లు కూడా తమ వంత పాత్ర పోషించారని తెలిపాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై మాట్లాడిన రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసమే అక్షర్ పటేల్ను అప్ది ఆర్డర్ ఆడించామని తెలిపాడు. మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇదే జోరును కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపాడు.

ఆ క్రెడిట్ బౌలర్లదే..
'చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మేం ఈ ఫార్మాట్ ఆడుతున్నాం. మేం త్వరగా రీగ్రూప్ అయ్యి విజయం కోసం చేయాల్సిందానిపై ఫోకస్ పెట్టాలనుకున్నాం. ప్రత్యర్థి ఓపెనర్లు మాపై ఒత్తిడి పెంచడంతో శుభారంభం అందుకోలేకపోయాం. కానీ మేం పుంజుకున్న విధానం మాత్రం అద్భుతం. ఇది కాస్త లాంగెస్ట్ ఫార్మాట్. తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిస్థితులు ప్రతికూలంగా మారినంత మాత్రానా అవకాశం ఉండదని కాదు. మా కమ్బ్యాక్ క్రెడిట్ మాత్రం బౌలర్లదే. ప్రతీ ఒక్కరు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ జోరును ముందుకు నడిపించడం ముఖ్యం. కీలకమైన సమయంలో వికెట్లు తీశాం. మైదానంలోని మా శక్తి అద్భుతంగా ఉంది.
వారిని కట్టడి చేసేందుకే..
లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసమే అక్షర్ పటేల్ను అప్దీ ఆర్డర్ ఆడించాం. ఇంగ్లండ్లో ఇద్దరూ లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఉన్నారనే విషయం మాకు తెలుసు. వారిని కట్టడి చేసేందుకే లెఫ్టాండర్ అయిన అక్షర్ పటేల్ను మిడిల్ ఆర్డర్లో ఆడించాం. గత రెండేళ్లుగా అక్షర్ పటేల్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ రోజు తన మెరుగైన ప్రదర్శనను అందరికి చూపించాడు. భాగస్వామ్యం అవసరమైనప్పుడు శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎలాంటి లక్ష్యం లేదు. జట్టుగా మెరుగైన ప్రదర్శన చేస్తూ ముందుకు కొనసాగడమే. బౌలింగ్, బ్యాటింగ్లో సమష్టిగా రాణించేందుకు ప్రయత్నించాలి. ఈ మ్యాచ్ చివర్లో మేం వికెట్లు కోల్పోకుండా ఉండాల్సింది.'అని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.
రాణించిన శుభ్మన్, అయ్యర్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/26), అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా(3/53) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహ్మూద్(2/47), ఆదిల్ రషీద్(2/49) రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, జాకోబ్ బెతెల్ తలో వికెట్ పడగొట్టారు. లక్ష్యచేధనలో భారత్ 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా.. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మూడో వికెట్కు 94 పరుగులు జోడించి గెలుపు బాట వేసారు.