పల్లెకెలె: తమ ఫీల్డింగ్ చాలా నాసిరకంగా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వీలైనంత త్వరగా తమ ఫీల్డింగ్ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఆసియాకప్ 2023లో భాగంగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్దతిన 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ కోసం ఎంపిక చేసే జట్టుపై క్లారిటీతోనే ఆసియాకప్ 2023 బరిలోకి దిగామని తెలిపాడు. ఆసియాకప్ లీగ్ దశలో ఆడే రెండు మ్యాచ్లతో వరల్డ్ కప్ టీమ్పై స్పష్టత రాదనే విషయం తమకు తెలుసున్నాడు.

నేపాల్పై తాను ఆడిన ఇన్నింగ్స్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 'నా బ్యాటింగ్ నాకు నచ్చలేదు. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ ఒకసారి రిథమ్లోకి వచ్చిన తర్వాత పరుగులు రాబట్టాను. ఫ్లిక్ స్వీప్ షాట్ ఆడాలని ముందుగా అనుకోలేదు. ఓవర్ షార్ట్ ఫైన్ దిశగా చిప్ చేయాలనుకున్నాను. కానీ బ్యాట్ పవర్కు అది సిక్సర్గా వెళ్లింది.
వన్డే ప్రపంచకప్ టీమ్పై క్లారిటీతోనే ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఆసియాకప్లోని రెండు మ్యాచ్లతో ప్రపంచకప్ జట్టుపై క్లారిటీ రాదనే విషయం మాకు తెలుసు. అదృష్టవశాత్తు తొలి మ్యాచ్లో పూర్తిస్థాయి బ్యాటింగ్.. రెండో మ్యాచ్లో బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. తద్వారా ఓ పూర్తి మ్యాచ్ ఆడిన అవకాశం మాకు దక్కింది.
టీమ్ కాంబినేషన్పై ఇంకా కసరత్తు జరుగుతుంది. చాలా మంది ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చారు. వారందరికి రిథమ్ అందుకునేందుకు కాస్త సమయం కావాలి. పాకిస్థాన్తో మ్యాచ్లో తీవ్ర ఒత్తిడిలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్లో బౌలింగ్ పర్వాలేదనిపించినా.. ఫీల్డింగ్ మాత్రం చెత్తగా ఉంది. త్వరగా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్(97 బంతుల్లో 8 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సోంపల్ కమీ(56 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 48) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ కుశాల్ భుర్టెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/61), రవీంద్ర జడేజా(3/40) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్.. నేపాల్కు కలిసొచ్చింది.
అనంతరం వర్షం కారణంగా టీమిండియా లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్ణయించారు. ఇక భారత్ 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 147 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 74 నాటౌట్), శుభ్మన్ గిల్(62 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 67 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు.