ఇంగ్లండ్ బ్యాటర్ ఓలి పోప్ అసాధారణ బ్యాటింగ్తోనే సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్లో తమ పేలవ బ్యాటింగ్ ఓటమిని శాసించిందన్నాడు. ఓలి పోప్ మాత్రం అసాధారణ ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు. భారత గడ్డపై అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన ఓవర్సీస్ ప్లేయర్ అతనేనని ప్రశంసించాడు.

'నాలుగు రోజులు జరిగిన ఈ మ్యాచ్లో ఎక్కడ తప్పు జరిగిందని పాయింట్ అవుట్ చేసి చెప్పడం కష్టమే. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కిన తర్వాత ఈ మ్యాచ్లో విజయం మాదే అనుకున్నాం. కానీ ఓలిపోప్ అసాధారణ బ్యాటింగ్తో మా విజయాన్ని లాగేసుకున్నాడు.
నేను చూసిన మ్యాచ్ల్లో భారత గడ్డపై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఓవర్సీస్ ప్లేయర్ ఓలిపోప్. అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 230 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధిస్తామనుకున్నా. పిచ్ కూడా బౌలింగ్కు అనుకూలంగా లేదు. అయితే మేం బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాం. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం.
మేం ఏ ప్రదేశాల్లో బౌలింగ్ చేశామో స్వయంగా వెళ్లి పరీక్షించాను. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేశాం. ప్రతీ రోజు ఆట ముగిసిన అనంతరం మా ఆటను మేం విశ్లేషించుకున్నాం. ఏ ప్లాన్ వర్కౌట్ అయింది? ఏది కాలేదని అనలైజ్ చేశాం. బౌలర్లు తమ ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారు.
కానీ ఓలి పోప్ అద్భుతంగా ఆడాడు. అతనికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. కీలక సమయంలో అద్భుత బ్యాటింగ్తో వారి జట్టును ఆదుకున్నాడు. ఒకరిద్దరి వైఫల్యమని చెప్పడం కంటే ఈ మ్యాచ్లో మేం జట్టుగా విఫలమయ్యాం. తొలి ఇన్నింగ్స్ అనంతరం వారి బ్యాటింగ్, మా బ్యాటింగ్ చూసిన తర్వాత ఈ మ్యాచ్లో గెలుపు మాదేనని భావించాం. కానీ రెండో ఇన్నింగ్స్లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాం.
సిరాజ్, బుమ్రాలను మ్యాచ్ను చివరి రోజు వరకు తీసుకెళ్లమని చెప్పాను. లక్ష్యాన్ని 20-30 పరుగులే అవసరమైతే ఏదైనా జరగొచ్చని చెప్పాను. మా లోయరార్డర్ బాగా ఆడింది. టాపార్డర్ ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సింది. ఈ ఓటమి మా ఆటగాళ్లకు ఓ గుణపాఠం. ఈ సిరీస్లో ఇది తొలి మ్యాచే. తదుపరి మ్యాచ్లో సత్తా చాటుతాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.