టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వాంఖడే క్రికెట్ స్టేడియంలోని ఓ స్టాండ్కు రోహిత్ శర్మ పేరు పెట్టింది. ఈ స్టాండ్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి రోహిత్ శర్మ తల్లిదండ్రులు పూర్ణిమా-గురునాథ్ శర్మలు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత శరద్ పవార్, భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్లతో పాటు హిట్ మ్యాన్ సతీమణి రితికా సజ్డే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోహిత్ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు.
అస్సలు ఊహించలేదు..
'ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు. వాంఖడే స్టేడియంలో ఇలా స్టాండ్కు నా పేరు పెడతారని నేను అస్సలు ఊహించలేదు. చిన్నప్పుడు ముంబై, టీమిండియా తరఫున ఆడాలని కోరుకున్నప్పుడు.. వీటి గురించి అస్సలు ఆలోచించలేదు. ఏ ఆటగాడికైనా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని, జట్టుకు అద్భుత విజయాలు అందించాలని ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో మైలురాళ్లు దక్కుతాయి. అయితే వాటన్నింటి కంటే ఇది ఎంతో ప్రత్యేకం. వాంఖడే స్టేడియంలో నాకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి.

మాటల్లో చెప్పలేని అనుభూతి..
గొప్ప ఆటగాళ్లు, రాజకీయ నేతల స్టాండ్స్ మధ్య నా పేరు ఉండటం మాటల్లో చెప్పలేని అనుభూతి. నాకు ఈ గౌరవాన్ని అందించిన ముంబై క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు. నేను రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికాను. వన్డేల్లో ఆడుతున్నాను. ఐపీఎల్లో మే 21న ఢిల్లీతో జరిగే మ్యాచ్ కోసం ఇక్కడికి వస్తాను. అప్పుడు నాకు ప్రత్యేకమైన అనుభూతి దక్కుతుంది. ఈ మైదానంలో టీమిండియా తరఫున ఆడటం నాకు ప్రత్యేకంగా నిలవనుంది. మా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ గౌరవాన్ని అందుకోవడం గొప్పగా ఉంది.
వారి త్యాగాల వల్లే..
నా జీవితంలో ప్రతీ ఒక్కరికీ.. వారు చేసిన త్యాగాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా అమ్మా నాన్న, నా సతీమణి, మా తమ్ముడు, మరదలు.. ఇలా కుటుంబమంతా నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నా కోసం జీవితంలోని చాలా సంతోషాలను వారు దూరం చేసుకున్నారు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. వాంఖడే స్టేడియంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వినోద్ మన్కడ్, దిలీప్ వెంగ్సర్కార్ పేరిట స్టాండ్స్ ఉన్నాయి. తాజాగా రోహిత్ శర్మతో పాటు శరద్ పవార్, అజిత్ వాడేకర్ పేరిట స్టాండ్లను ఆవిష్కరించారు.