
న్యూఢిల్లీ: తన క్రీడా జీవితంలోనే ఇంతకాలం బ్యాట్ పట్టకుండా ఉండలేదని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. అసలు ఇంత సుదీర్ఘమైన విరామం కూడా లభించలేదన్నాడు. ఈ పరిస్థితుల్లో మళ్లీ మైదానంలోకి బరిలోకి దిగడం సవాల్తో కూడుకన్నదేనని అభిప్రాయపడ్డాడు. ఇక సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సారథి అయిన రోహిత్.. క్యాష్ రిచ్ లీగ్ కోసం సమాయత్తం అవుతున్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్ తనకెంతో ప్రత్యేకమని, ఎన్నో రోజుల తరువాత మైదానంలో అడుగు పెట్టగలుగుతున్నానని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ చెప్పుకొచ్చాడు. 'నా క్రీడా జీవితంలో ఇంత సుదీర్ఘమైన విరామం ఎప్పుడూ తీసుకోలేదు. ఇంతకు ముందెన్నడూ ఇంత కాలం పాటు బ్యాట్ పట్టుకోకుండా ఉన్నది లేదు. దీంతో నా ఆటతీరు ఎలా మారిందో తెలియదు. ముఖ్యంగా దానిపై దృష్టి పెట్టాలి. అయితే శారీరకంగా మాత్రం ఇప్పటికీ పూర్తి దృఢంగా ఉన్నాను. టోర్నీకి చాలా సమయం ఉంది. దీంతో నా ఆటని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నా. ఇక 40 డిగ్రీల ఎండ ఉండే దుబాయ్లో ఆడటం అంత సులువైన పని కాదు'అని రోహిత్ తెలిపాడు.
కెప్టెన్గా ఉన్నప్పుడు తనను తాను జట్టులో తక్కువ ప్రాధాన్యమున్న వ్యక్తిగా భావిస్తానని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. సారథిగా ఉన్నప్పుడు మిగిలిన ఆటగాళ్లు ఎంతో ముఖ్యమని భావించి ప్రాధాన్యమివ్వాలని, ఈ సిద్దాంతం తనకు బాగా ఉపయోగపడిందన్నాడు. అలాగే కెప్టెన్గా ఉన్న సమయంలో కోపం, భావోద్వేగాలను దాచుకోవడం ఎంతో ముఖ్యమన్నాడు. ఇక రోహిత్ కెప్టెన్సీలో ఇప్పటికే ముంబై జట్టు 4 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే సక్సెస్ఫుల్ కెప్టెన్గా రోహిత్ రికార్డ్ సృష్టించాడు. ఈ ఏడాది కూడా టైటిల్ గెలిచి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.