న్యూఢిల్లీ: భారత జట్టులో నాలుగో స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత మరే బ్యాటర్ కూడా ఆ స్థానంలో స్థిరపడలేదని తెలిపాడు. వన్డే ప్రపంచకప్ ముందు టీమిండియాకు ఇది పెద్ద సమస్యగా మారిందన్నాడు. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ మెరుగ్గా రాణించినా.. గాయంతో అతను జట్టుకు దూరమయ్యాడని తెలిపాడు.
ఇక ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న టీమిండియా జట్టు లోపాలపై ఫోకస్ పెట్టింది. నెంబర్ 4లో సరైన బ్యాటర్ లేకనే 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమిపాలైంది. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ 20 మ్యాచ్లు ఆడి 47.35 సగటుతో 805 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు ఐదు హాఫ్ సెంచరీలున్నాయి.

దాంతో అతను ఈ స్థానానికి సరిపోతాడని అంతా భావించారు. కానీ వెన్నుముక గాయంతో గత 4 నెలలుగా అతను జట్టుకు దూరమయ్యాడు. అతని ఫిట్నెస్పై ఇంకా సందేహాలు ఉండటం టీమిండియా నెంబర్ 4 కథ మళ్లీ మొదటికి వచ్చింది. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన రోహిత్ శర్మ.. టీమిండియా నెంబర్ 4 సమస్యపై స్పందించాడు.
'చాలా కాలంగా నెంబర్ 4 అనేది మాకు సమస్యగా మారింది. యువరాజ్ సింగ్ తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. కానీ గత కొంతకాలంగా నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. దురదృష్టవశాత్తు అతను గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. అతనితో పాటు ఇతర యువ ఆటగాళ్లు కూడా గాయపడ్డారు.
దాంతో గత నాలుగేళ్లుగా నాలుగో స్థానంలో కొత్త బ్యాటర్ను చూస్తున్నారు. గత నాలుగు, ఐదేళ్లుగా టీమిండియాకు గాయాల బెడద ఎక్కువైంది. ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనప్పుడు ఇతర ప్లేయర్లను ఆడించాల్సి వస్తుంది. నెంబర్ 4లో కూడా ఇదే జరుగుతోంది. నేను కెప్టెన్ కాకముందు కూడా ఇదే జరిగింది.
చాలా మంది ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కొందరు గాయాలతో దూరమైతే మరికొందరు పేలవ ఫామ్తో జట్టుకు దూరమయ్యారు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఆసియాకప్లో ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తామని తెలిపాడు. అయితే నాలుగో స్థానాన్ని విరాట్ కోహ్లీకి అప్పగించి మూడో స్థానంలో యువ ప్లేయర్ తిలక్ వర్మను ఆడించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.