IND vs WI:మీరు మూసుకుంటే కోహ్లీ బాగానే ఉంటాడు.. మీడియాపై రోహిత్ శర్మ ఫైర్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుత సారథి రోహిత్ శర్మ అండగా నిలిచాడు. మీడియా ఓవరాక్షన్ తగ్గిస్తే కోహ్లీ చెలరేగుతాడని చురకలంటించాడు. వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల్లో కలిపి కోహ్లీ 26(8, 18, 0)పరుగులు మాత్రమే చేశాడు. గత రెండేళ్లుగా సెంచరీ చేయని కోహ్లీ పేలవ ఆటతీరుతో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కేవలం ప్లేయర్గానే జట్టులో కొనసాగుతున్నాడు. బ్యాటర్గానైనా కోహ్లీ తన మునపటి ఫామ్ను అందుకుంటాడని భావించిన ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది.

మీరు అతిచేయడం ఆపండి..
ఈ క్రమంలోనే మూడు టీ20ల సిరీస్కు ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. తన సహచర ఆటగాడికి మద్దతుగా మాట్లాడాడు. కోహ్లీ ఫామ్ గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా గట్టిగా కౌంటరిచ్చాడు. 'మీతోనే మొదలు పెట్టాలనుకుంటున్నా... మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా? విరాట్ కోహ్లీబాగున్నాడు. తను మానసికంగా ఎంతో బలవంతుడు. గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. సుదీర్ఘకాలంగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న వ్యక్తికి ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలుసు. కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసు. నిజానికి ఇదంతా మీ వల్లే మొదలైంది. మీరు సైలెంట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది'అంటూ చురకలంటించాడు.

ఐపీఎల్ ప్రభావం ఉండొద్దు..
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ప్రభావం టీమిండియా ప్రయోజనాలపై పడకూడదని రోహిత్ శర్మ ఆటగాళ్లను హెచ్చరించాడు. ఐపీఎల్లో ఏ జట్టుకు ఆడుతున్నారు? ఎన్నో స్థానంలో బ్యాటింగ్కు దిగుతున్నారు? అన్న అంశాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. భారత్ తరఫున ఆడేటపుడు జట్టు అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

టీమిండియాకే ప్రియారిటీ..
'వేలం ముగిసింది. భావోద్వేగాలకు గురికావడం సహజం. అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు దృష్టి మొత్తం విండీస్తో సిరీస్పైనే ఉండాలి. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితో నిన్న మాట్లాడాం. రానున్న రెండు వారాలు ఎంతో ముఖ్యం. బ్లూ జెర్సీలో ఆడుతున్నపుడు ఎలా ఉండాలో మరోసారి గుర్తు చేశాం. నిజానికి వాళ్లంతా ప్రొఫెషనల్స్. అయితే, మేం చెప్పాల్సింది చెప్పాం. ఆయా ఫ్రాంఛైజీలకు ఆడుతున్నపుడు బాధ్యతలు వేరుగా ఉంటాయి. టీమిండియాకు ఆడేటపుడు అలా ఉండదు. ప్రస్తుతం జాతీయ జట్టు కూర్పుపైనే మా దృష్టి'' అని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్తో కోల్కతా వేదికగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుండగా.. తొలి మ్యాచ్ బుధవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications