టీ20 క్రికెట్ ఆడుతున్నప్పుడు ఔటవుతామేమోనని అస్సలు భయపడవద్దని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలా భయపడితే రాణించలేమని, జట్టు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని సూచించాడు. అఫ్గానిస్థాన్తో బుధవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా డబుల్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్ కాస్టర్ జియోసినిమాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగిన విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్లకు మద్దతుగా నిలిచాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలోనే ఈ ఇద్దరూ ఔటయ్యారని చెప్పాడు.

'ఇప్పటి వరకు మేం ఆడిన అన్ని సిరీస్ల్లోనూ బాధ్యతలను స్పష్టంగా పంచుకున్నాం. మా ఆటగాళ్లకు వారి పాత్రపై క్లారిటీ ఇచ్చాం. జట్టుకు తమ అవసరం ఏంటో కుర్రాళ్లకు తెలుసు. చివరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. రన్స్ చేయాలనే కసితో బరిలోకి దిగిన అతను దురదృష్టవశాత్తు తొలి బంతికే ఔటయ్యాడు.
సహజంగా విరాట్ కోహ్లీకి డకౌట్ అనే పదమే నచ్చదు. అలా ఔటైనప్పటికీ అతని ఆలోచన మాత్రం సరైన దిశలోనే ఉంది. వికెట్ కీపర్ సంజూ శాంసన్ కూడా ఇలానే దూకుడుగా ఆడే ప్రయత్నంలోనే వికెట్ కోల్పోయాడు. టీ20ల్లో ఔటవుతామేమోనని అస్సలు భయపడవద్దు. టీమ్ ఇచ్చి న బాధ్యతను పూర్తి చేసేకుందుకు ప్రయత్నించాలి.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
వన్డే ప్రపంచకప్ పరాజయం స్పందిస్తూ.. రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం గురించి ఆలోచించడం సరికాదు. నా వరకైతే 50 ఓవర్ల ప్రపంచకప్ గెలవడం ఎప్పటికీ ప్రత్యేకమే. అలాగని టీ20 ప్రపంచకప్, టెస్ట్ ఛాంపియన్షిప్ కీలకమైన ఈవెంట్స్ కాదని చెప్పడం నా ఉద్దేశం కాదు.
వన్డే ప్రపంచకప్ చూస్తూ పెరిగిన నాకు అది గెలవడం ప్రత్యేకంగా భావించేవాడిని. భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ చేరాం. కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాం. మా మీద అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. వారి బాధను మేం అర్థం చేసుకోగలం. ప్రస్తుతం మన ముందు టీ20 ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉంది. తప్పకుండా గెలుస్తామనే నమ్మకంతో బరిలోకి దిగుతాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.