ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన విషయం తెలిసిందే. టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ నూతన కెప్టెన్గా ప్రకటించారు. ఈ నిర్ణయం రోహిత్ శర్మ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
జట్టుకు ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై వేటు వేయడం సరికాదని వారు మండిపడ్డారు. కొందరైతే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ను అన్ఫాలో చేశారు. ఈ నిర్ణయం వెలువడని గంటల వ్యవధిలోనే ముంబై ఇండియన్స్ 5-10 లక్షల ఫాలోవర్లను కోల్పోయింది.

ఇక రోహిత్ శర్మ సైతం ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ట్రేడింగ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రోహిత్ శర్మను అప్రోచ్ అయినట్లు కూడా ప్రచారం జరిగింది. రోహిత్ శర్మ సైతం పక్క చూపులు చూస్తున్నాడనే కథనాలు వెలువడ్డాయి.
అయితే ఐపీఎల్ 2024 వేలం ముగిసిన వెంటనే రోహిత్ శర్మ జట్టు మారుతున్నాడనే ప్రచారానికి ముంబై ఇండియన్స్ ఫుల్స్టాప్ పెట్టింది. రోహిత్ శర్మతో పాటు మరే సీనియర్ ప్లేయర్ ముంబై ఇండియన్స్ను వీడటం లేదని స్పష్టం చేసింది. కానీ ఐపీఎల్ 2024 వేలం ముగియడంతో ట్రేడింగ్ విండో మళ్లీ ఓపెన్ అయ్యింది. ఫిబ్రవరి 22 వరకు ఆటగాళ్లను ట్రేడింగ్ చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది.
దాంతో ఆయా జట్లలో చాలా మార్పులు జరిగే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే జట్టు మార్పు గురించి రోహిత్ శర్మ మాట్లాడిన ఓ పాత వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కాకుండా మరే జట్టుకు ఆడుతారని ఓ హోస్ట్ అడిగిన ప్రశ్నకు రోహిత్ ఆ వీడియోలో సమాధానమిచ్చాడు.
రోహిత్ శర్మ.. సీఎస్కే, ఆర్సీబీకి కాకుండా కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు సారథ్యం వహించాలని ఉందని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈడెన్ గార్డెన్స్ మైదానం తన ఫేవరేట్ గ్రౌండ్ అని, కేకేఆర్ హోం గ్రౌండ్ కూడా ఈ మైదానం కావడంతోనే ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించడంతో పాటు సారథ్యం వహించాలని కోరుకుంటున్నానని రోహిత్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
'ముంబై ఇండియన్స్ కాకుండా వేరే జట్టుకు ఆడాలంటే.. కేకేఆర్ను ఎంచుకుంటా. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ నా ఫేవరేట్ గ్రౌండ్. అందుకే కేకేఆర్కు ఆడాలనుకుంటున్నా.'అని ఆ వీడియోలో రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగానే 2013లో టెస్ట్ల్లోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. తొలి మ్యాచ్లో 177 పరుగులతో సత్తా చాటాడు. 2012లో ఇదే మైదానం వేదికగా తొలి ఐపీఎల్ శతకం అందుకున్నాడు. 2014లో శ్రీలంకతో ఈ మైదానం వేదికగా జరిగిన వన్డేలో 264 పరుగులతో డబుల్ సెంచరీ బాదాడు. 2013, 2015 సీజన్ ఐపీఎల్ టైటిళ్లను రోహిత్ ఈడెన్ గార్డెన్స్లోనే అందుకున్నాడు.