
నాదే పూర్తి బాధ్యత..
'ఏ తప్పు జరుగుతుందో తెలిస్తే దాన్ని సరిదిద్దుకోవచ్చు. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. ప్రతి మ్యాచ్కు ఎప్పటిలాగే సన్నద్ధమవుతున్నాం. అందులో తేడా లేదు. అంచనాలకు తగ్గట్లుగా జట్టును నడిపించలేకపోతున్నందుకు నాదే పూర్తి బాధ్యత. నాకు నేను మద్దతుగా ఉంటూ ఆటను ఆస్వాదిస్తా. ఏదేమైనా ముందుకు సాగడం ముఖ్యం.
ఇప్పుడే ప్రపంచం అంతమైపోలేదు. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల నుంచి పుంజుకున్నాం.ఇప్పుడు కూడా మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తాం. చివరి ఓవర్లలో బుమ్రాకు బౌలింగ్ ఇవ్వడం కోసం ఆరంభంలో ఆలస్యంగా బంతినందించా.

ఒక్క మ్యాచ్ గెలవకున్నా..
మిగతా బౌలర్లు ఇంకా రాణించాల్సి ఉంది. వరుసగా ఆరు మ్యాచ్లు ఓడిపోయాం. సరైన జట్టు కూర్పు గురించి ఆలోచిస్తున్నాం. పరాజయాలు ఎదురైనపుడు తప్పులు వెతకడం సులువే. కానీ మా ఉత్తమ తుది జట్టు కోసం కసరత్తు చేస్తూనే ఉన్నాం. కేఎల్ రాహుల్ గొప్పగా బ్యాటింగ్ చేశాడు. మా టాప్ఆర్డర్లో అలాంటి ప్రదర్శన లోపించింది.
ముఖ్యంగా మా టాప్ 4 బ్యాట్స్మన్లో ఏ ఒక్కరైనా ఇన్నింగ్స్ ఆసాంతం ఆడాల్సి ఉంది. ఒక్క మ్యాచ్ గెలవకపోయినా తలెత్తుకునే ఉండాల్సిన అవసరం ఉంది'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

రాహుల్ సెంచరీ..
ఈ మ్యాచ్లో ముందుగా లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' కేఎల్ రాహుల్ (60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 103 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లలో జైదేవ్ ఉనద్కత్ (2/32) ఆకట్టుకున్నాడు.
బుమ్రా (0/24) వికెట్లు తీయకపోయినా పరుగులు కట్టడి చేశాడు. మిల్స్ 3 ఓవర్లలోనే 54 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసి ఓటమిపాలైంది. సూర్యకుమార్ (27 బంతుల్లో 3 ఫోర్లతో 37 ), బ్రెవిస్ (13 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు.


Click it and Unblock the Notifications












