
రాంగ్ టైమ్లో ఔటయ్యా..
రాబిన్సన్ వేసిన బౌలింగ్లో పుల్ షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ ఫైన్లెగ్లో సామ్ కరన్కు చిక్కి వెనుదిరిగాడు. ఆ వెంటనే చతేశ్వర్ పుజారా తన వైఫల్యాన్ని కొనసాగించగా.. విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్గా వెనుదిరగాడు. ఆ తర్వాత అజింక్యా రహానే రనౌట్ అయ్యాడు. దాంతో రోహిత్ శర్మ అనవసర షాట్ ఆడాడనే విమర్శలు వచ్చాయి. దీనిపై మ్యాచ్ అనంతరం స్పందించిన రోహిత్ శర్మ.. స్కోర్ బోర్డు ముందుకు కదలాలంటే షాట్స్ ఆడాల్సిందేనని తన షాట్ను సమర్థించుకున్నాడు. అయితే తాను ఔటవ్వడం వల్ల జట్టుకు నష్టం జరిగిందని, రాంగ్ టైమ్లో ఔటయ్యానని, చెప్పాడు.

నా జోన్లోకి రావడంతోనే..
'పరిస్థితుల సవాల్గా మారినప్పుడు నిదానంగా ఆడుతూ వాటిని గౌరవించాలి. నేను అదే చేశాను. కానీ స్కోర్బోర్డును ముందుకు జరపాలంటే షాట్స్ ఆడాల్సిందే. నేను రాంగ్ టైమ్లో ఔటయ్యాను. దానికి పశ్చాత్తాపపడుతున్నా. నేను గనుక ఔటవ్వకపోయుంటే భారత్ మెరుగైన స్థితిలోనే ఉండేది. ఈ నాలుగు వికెట్లు కూడా పోయేవి కావు. అయితే నేను ఆడింది నా ఫేవరేట్ షాట్.
నా జోన్లోకి వచ్చిన బంతి కావడంతోనే ఆ షాట్ ఆడాల్సి వచ్చింది. తొలి గంట ఇంగ్లండ్ బౌలర్లు ఒక్క లూస్ బాల్ కూడా వేయలేదు. చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో స్కోర్ను పెంచాలంటే ముందడుగు వేసి షాట్స్ ఆడాల్సిందే. బౌలర్లపై ఒత్తిడి పెంచాల్సిందే.

రిస్క్ తీసుకోక తప్పదు..
ఔటయ్యే ప్రమాదం ఉందని తెలిసినా రిస్క్ తీసుకోక తప్పదు. ఔటైనప్పుడు నిరాశ కలుగుతుంది. నాకు ఇప్పుడు అదే ఫీలింగ్ ఉంది. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు మన జోన్లోకి వచ్చిన బంతులను బౌండరీలకు తరలించాలి. రాహుల్, నేను ఈ రోజు చేసింది అదే. ఈ తరహా ఆలోచనతోనే మా బ్యాటింగ్ సాగింది. ఔటవ్వడానికి.. బౌండరీ వెళ్లేందుకు మధ్య ఓ చిన్న గీతనే ఉంటుంది. మనం ఆడి షాట్ నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్తే క్యాచ్ ఔటవుతాం. అదే బంతి ఫీల్డర్కు అటు ఇటు ఐదడుగుల దూరం పడితే బౌండరీ వస్తుంది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

రాహుల్ హాఫ్ సెంచరీ..
ఇంగ్లండ్తో ఆరంభ టెస్ట్లో టీమిండియా ఓపెనర్లు రాణించినా మిడిలార్డర్ విఫలమైంది. కేఎల్ రాహుల్ (57 బ్యాటింగ్) అర్ధ సెంచరీతో పాటు రోహిత్ శర్మ (36) రాణించగా.. మిగతా బ్యాట్స్మన్ విఫలమయ్యారు. ఓవర్నైట్ స్కోరు 21/0తో భారత్ తొలి ఇన్నింగ్స్ కొనసాగించింది. చతేశ్వర్ పుజారా (4), కెప్టెన్ కోహ్లీ (0), అజింక్యా రహానె (5) దారుణంగా విఫలమయ్యారు. జేమ్స్ అండర్సన్ 2, రాబిన్సన్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం టీమిండియా 58 పరుగుల వెనుకంజలో ఉంది. రెండు గంటలపాటు కురిసిన వర్షంతో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు చివరి సెషన్ను రద్దు చేశారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 183 రన్స్ చేసింది.


Click it and Unblock the Notifications
