
ఈ సెంచరీ స్పెషల్..
'ఈ సెంచరీ నాకు ప్రత్యేకమైనది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో మెరుగ్గా ఉండాలంటే ఈ సిరీస్లో శుభారంభం అందుకోవడం చాలా ముఖ్యం. ఈ తరహా సిరీస్లు ఆడుతున్నప్పుడు ఆరంభం ఎంత ముఖ్యమో మాకు బాగా తెలుసు. నా వ్యక్తిగత ప్రదర్శనతో జట్టు విజయంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తు నేను కొన్ని టెస్ట్ మ్యాచ్లకు దూరమయ్యాను. ఎట్టకేలకు రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. నేను కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండే టెస్ట్ మ్యాచ్లు ఆడాను. ఇంగ్లండ్లో కరోనా బారినపడి సౌతాఫ్రికా సిరీస్కు దూరమయ్యాను.

ఈ తరహా పిచ్లపైనే పెరిగా..
చేతి వేలి గాయంతో బంగ్లాదేశ్లో ఆడలేకపోయాను. సుదీర్ఘ కాలం ఆడుతున్నప్పుడు ఇలాంటివి జరగడం సహజమే. అయితే గతంలో కూడా నేను గాయాల నుంచి కోలుకొని పునరాగమనం చేసిన అనుభవం ఉంది. గత రెండు మూడేళ్లుగా భారత్లో టర్నింగ్ ట్రాక్ చూస్తున్నాం. పిచ్ తగ్గట్లు బ్యాటింగ్ ప్రణాళికలను సిద్దం చేసుకోవాలి. నేను ఓపెనర్గా ప్రమోట్ అయినప్పటి నుంచి ప్రణాళికలకు తగ్గట్లు ఆడుతున్నా. ఇక ముంబై ఈ తరహా టర్నింగ్ ట్రాక్స్పై ఆడుతూనే పెరిగాను. ఈ తరహా వికెట్లపై రాణించాలంటే.. ఫుట్ వర్క్ను ఉపయోగించుకుంటూ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాల్సి ఉంటుంది.

ఆ రెండు వికెట్లే టర్నింగ్ పాయింట్..
ఈ మ్యాచ్ ఆరంభ ఓవర్లలోనే భారత పేసర్లు రెండు వికెట్ల తీయడంతో మూమెంటమ్ లభించింది. మా ప్రత్యర్థి మ్యాచ్ అసాంతం ఒత్తిడిలో ఉంది. మా క్వాలిటీ స్పిన్నర్లను వారు ఆడలేకపోయారు. పేసర్లు కూడా అదరగొట్టారు. మా బ్యాటర్లు కూడా అద్భుతంగా రాణించి 400 పరుగులు చేశారు. దాంతో స్పిన్నర్లు మరింత ఉత్సాహంగా బౌలింగ్ చేసి విజయాన్నందించారు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

ఆసీస్ 91 ఆలౌట్..
243 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(25 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(5/37) ఐదు వికెట్ల ఘనత అందుకోగా.. జడేజా(2/34), మహమ్మద్ షమీ(2/13) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో నాలుగు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
అంతకుముందు 321/7 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ను 139.3 ఓవర్లలో 400 పరుగులకు ముగించింది. ఓవర్నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా(70) త్వరగానే ఔటైనా.. అక్షర్ పటేల్(174 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 84) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. టెయిలెండర్ మహమ్మద్ షమీ(47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 37) విలువైన పరుగులతో భారత్కు భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఏడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. నాథన్ లియోన్కు ఓ వికెట్ దక్కింది.


Click it and Unblock the Notifications
