శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ అందించిన సహకారంతోనే సెంచరీ చేయగలిగానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ మ్యాచ్లో తన బ్యాటింగ్ను ఆస్వాదించానని చెప్పాడు. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా కటక్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
గత కొద్ది రోజులుగా పేలవ ఫామ్తో సతమతమైన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్లో విధ్వంసకర శతకంతో చెలరేగి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్పై సంతోషం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ.. పకడ్బందీ ప్రణాళికలతో ఆడినట్లు తెలిపాడు.

జట్టును గెలిపించడం..
'ఈ శతకాన్ని ఆస్వాదించాను. ఈ సిరీస్లో కీలకమైన మ్యాచ్లో జట్టు తరఫున పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో నేను ఎలా బ్యాటింగ్ చేయాలనేది కొన్ని భాగాలుగా విభజించుకున్నాను. వన్డే ఫార్మాట్ టీ20 గేమ్ కంటే పెద్దది.. టెస్ట్ క్రికెట్ కంటే చిన్నది. అయినా పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. నేను సాధ్యమైనంత మేర చివరి వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నాను.
బ్లాక్ సాయిల్ పిచ్ కాస్త స్కిడ్ అవుతుంది. ఈ వికెట్పై ఫుల్ ఫేజ్ బ్యాట్తో ఆడటం కీలకం. అంతేకాకుండా ఇంగ్లండ్ బౌలర్లు శరీరమే లక్ష్యంగా బంతులు వేసేందుకు ప్రయత్నించారు. జరిగి ఆడటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. అందుకు తగ్గట్లుగా నా బ్యాటింగ్ ప్రణాళికలను సిద్దం చేసుకున్నాను. గ్యాప్స్లో షాట్స్ ఆడాను.
గిల్, అయ్యర్ అండతోనే..
నాకు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ నుంచి అద్భుతమైన సహకారం లభించింది. మేం ఒకరికొకరం బ్యాటింగ్ను ఆస్వాదించాం. శుభ్మన్ గిల్ క్లాస్ ఆటగాడు. అతన్ని నేను చాలా దగ్గరగా చూశాను. పరిస్థితులకు ఏ మాత్రం బెదిరిపోడు. అతని గణంకాలే ఈ విషయాన్ని తెలియజేస్తాయి. మిడిల్ ఓవర్లలో రాణించడం చాలా కీలకం. మిడిల్ ఓవర్లలో రాణిస్తే.. డెత్ ఓవర్ల గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. రెండు మ్యాచ్ల్లో మేం మిడిల్ ఓవర్లలో రాణించాం.
నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ మిడిల్ ఓవర్లలోనే ప్రత్యర్థిని దెబ్బతీసాం. ఈ మ్యాచ్లోనూ అదే చేశాం. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తే ప్రత్యర్థిని కట్టడి చేయవచ్చు. మేం జట్టుగా మెరుగ్గా ఉండాలనుకుంటున్నాం. గత మ్యాచ్ తర్వాత కూడా నేను ఇదే చెప్పాను. ప్లేయర్స్గా.. టీమ్గా అత్యుత్తమంగా రాణించడమే మా లక్ష్యం. కెప్టెన్, కోచ్లు చెప్పేదానిపై ఆటగాళ్లకు స్పష్టత ఉంటే.. వారి వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేస్తే ఈ విషయంపై పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
రోహిత్ శతకం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకే ఆలౌటైంది. బెన్ డక్కెట్(56 బంతుల్లో 10 ఫోర్లతో 65), జోరూట్(72 బంతుల్లో 6 ఫోర్లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/35) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లకు 308 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 119) శతక్కొట్టగా.. శుభ్మన్ గిల్(52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్(2/27) రెండు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.