బౌలర్ల అద్భుత ప్రదర్శనతోనే టీ20 ప్రపంచకప్ 2024లో శుభారంభం చేశామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్లో సత్తా చాటిన టీమిండియా.. అనంతరం బ్యాటింగ్లో సత్తా చాటి ఏకపక్ష విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ పిచ్ అస్సలు అర్థం కావడం లేదని చెప్పాడు. ఎలా ఆడాలో..? ఏం అంచనా వేయాలో కూడా తెలియడం లేదన్నాడు. పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉందని చెప్పిన రోహిత్ శర్మ.. పిచ్ పరిస్థితులు ఇలాగే ఉంటాయన్నట్లుగా పాకిస్థాన్తో హైఓల్టేజ్ మ్యాచ్కు సిద్ధమవుతామని తెలిపాడు. తన మోచేతి గాయం నొప్పి అలానే ఉందని చెప్పాడు.

'నా మోచేతి గాయం నొప్పి అలానే ఉంది. టాస్ సందర్భంగా చెప్పినట్లే పిచ్ అంచనా వేయలేని స్థితిలో ఉంది. అసలు ఈ వికెట్ నుంచి ఏం ఆశించాలో కూడా అర్థం కావడం లేదు. ఐదు నెలల వయసున్న ఈ పిచ్పై ఎలా ఆడాలో కూడా తెలియడం లేదు. సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా పిచ్ ఏ మాత్రం సెటిల్ కాలేదు.
ఇది బౌలర్లకు సరిపోయే వికెట్. బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్లో నిలకడగా బంతులు వేస్తే సరిపోతుంది. మా జట్టులోని బౌలర్లంతా చాలా టెస్ట్ క్రికెట్ ఆడారు. ఒక్క అర్ష్దీప్ సింగ్కు మాత్రమే టెస్ట్ క్రికెట్ అనుభవం లేదు. అయినా ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి మాకు శుభారంభాన్ని అందించాడు.
ఈ వికెట్పై మేం నలుగురు స్పిన్నర్లుతో ఆడాలనుకోలేదు. మేం సమతూకంగా ఉండే తుది జట్టును ఎంపిక చేశాం. పిచ్ పేస్కు అనుకూలంగా ఉంటే పేసర్లతో.. స్పిన్ అనుకూలంగా ఉంటే స్పిన్నర్లతో బరిలోకి దిగుతాం. ఈ రోజు ఇది నలుగురు పేసర్ల పిచ్. అయినా మేం ముందు జాగ్రత్తగా ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లను తీసుకున్నాం. నిజాయితీగా చెప్పాలంటే ఈ పిచ్పై ఏం ఆశించాలో కూడా అర్థం కావడం లేదు.
పరిస్థితులు ఇలాగే ఉంటాయన్నట్లుగా పాకిస్థాన్తో మ్యాచ్కు సిద్ధమవుతాం. సమష్టిగా రాణిస్తే దక్కే విజయంలో ఇదొక్కటి. వికెట్ బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉండటంతో మిడిల్ ఓవర్లలో కాస్త ఓపికగా బ్యాటింగ్ చేశాను. దాంతో ఏ షాట్స్ ఆడాలనే విషయం అర్థమైంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/27), జస్ప్రీత్ బుమ్రా(2/6), అర్ష్ దీప్ సింగ్(2/35), మహమ్మద్ సిరాజ్(1/13), అక్షర్ పటేల్(1/3) నిప్పులు చెరిగారు.
అనంతరం లక్ష్యచేధనకు టీమిండియా 12.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాగా.. రిషభ్ పంత్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 36 నాటౌట్) సత్తా చాటాడు.