టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి షాక్కు గురి చేశాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్.. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. అశ్విన్ ఆకస్మిక నిర్ణయంతో అభిమానులు, సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు షాకయ్యారు. సోషల్ మీడియా వేదికగా అతనికి అభినందనలు తెలుపుతున్నారు. భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు.

వాస్తవానికి అశ్విన్.. పెర్త్ టెస్ట్ విజయానంతరమే రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడట. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 'పెర్త్ టెస్ట్ విజయానంతరమే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యారు. కానీ నేనే పింక్ బాల్ టెస్ట్ ఆడాలని రిక్వెస్ట్ చేశాను. నా అభ్యర్థనతో వెనక్కి తగ్గిన అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకొని ఈ రోజు వెల్లడించాడు.
అశ్విన్ నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. అశ్విన్కు భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అతను గొప్ప మ్యాచ్ విన్నర్. అశ్విన్ చాలా సరదాగా ఉండే వ్యక్తి. మేం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అశ్విన్ వైపు చూసేవాళ్లం. అతను మమ్మల్ని గట్టెక్కించేవాడు. అతన్ని మేం ఎంతో మిస్సవుతాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
2010 శ్రీలంక పర్యటనలో హరారే వేదికగా జరిగిన వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అశ్విన్.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్తో చివరి మ్యాచ్ ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అశ్విన్ 765 వికెట్లు తీసాడు.
టెస్ట్ల్లో 106 మ్యాచ్ల్లో 2.83 ఎకానమీతో 537 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 వికెట్ల ఘనతను 37 సార్లు అందుకున్నాడు. 116 వన్డేల్లో 4.93 ఎకానమీతో 156 వికెట్లుత తీసాడు. 65 టీ20ల్లో 6.90 ఎకానమీతో 72 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో మూడు ఫార్మాట్లలో కలిపి 4, 400 పరుగులు చేశాడు. 106 టెస్ట్ల్లో 25.75 సగటుతో 3503 పరుగులు చేసిన్ అశ్విన్.. 6 సెంచరీలతో పాటు 14 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.