స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. అటు బంతి.. ఇటు బ్యాట్తోనూ టీమిండియాకు హార్దిక్ పాండ్యా కీలకమని చెప్పాడు. అతని అసాధారణ ప్రదర్శనతోనే బంగ్లాదేశ్పై విజయం సాధించామని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్తో శనివారం ఏకపక్షంగా జరిగిన సూపర్-8 మ్యాచ్లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. టీమ్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.

'టీ20ల్లో దూకుడుగా ఆడటం గురించి నేను చాలా రోజులుగా మాట్లాడుతున్నాను. ఈ మ్యాచ్లో మేం అన్ని విభాగాల్లో సత్తా చాటాం. పరిస్థితులను వేగంగా అందిపుచ్చుకున్నాం. ఈ మైదానంలో గాలులు వీచాయి. అయితే మేం అందుకు తగ్గట్లుగా తెలివిగా బ్యాటింగ్, బౌలింగ్ చేశాం. ఏది ఏమైనా జట్టులోని 8 మంది బ్యాటర్లు తమ పాత్ర షోషించాలి.
ఒక్కరు హాఫ్ సెంచరీ చేసినా మేం 197 పరుగులు చేశాం. టీ20ల్లో హాఫ్ సెంచరీలు, శతకాలు అవసరం లేదు. బౌలర్లపై ఎంత ఒత్తిడి పెట్టావ్ అన్నదే ముఖ్యం. ప్రపంచంలో అందరూ ఇలానే ఆడుతున్నారు. మేం కూడా అలానే ఆడాలనుకుంటున్నాం. జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లందరికి మేం అండగా ఉన్నాం.
హార్దిక్ పాండ్యా గురించి నేను గత మ్యాచ్లోనే చెప్పాను. అతని బ్యాటింగ్ మమ్మల్ని మంచి పొజిషన్లో ఉంచుతుంది. టాప్-5, 6 బ్యాటర్లు అనంతరం కూడా మేం మంచి ముగింపు కోరుకుంటున్నాం. హార్దిక్ పాండ్యా.. హార్డిక్ పాండ్యానే. అతని సామర్థ్యం ఏంటో మాకు బాగా తెలుసు. అతను మాకు చాలా కీలకమైన ఆటగాడు.
అతను ఇలానే అసాధారణ ప్రదర్శన కనబరిస్తే టీమిండియా కూడా మంచి పొజిషన్లో ఉంటుంది. ఈ మ్యాచ్లో బౌలర్లతో మట్లాడిన ప్రతీ విషయం మాకు ఫలితాన్నిచ్చింది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(24 బంతుల్లో 3 సిక్సర్లతో 34), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 37), రిషభ్ పంత్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36) మెరుపులు మెరిపించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్(2/32), రిషద్ హొస్సేన్(2/43) రెండేసి వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ పడగొట్డాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసి ఓటమిపాలైంది.
నజ్ముల్ హొస్సేన్ షాంటో(32 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 40), టన్జిద్ హసన్(31 బంతుల్లో 4 ఫోర్లతో 29), రిషద్ హొస్సేన్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 24 ) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/19) మూడేసి వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు.