IND vs SL: వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ బెర్త్ దక్కడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. మెగా టోర్నీ ప్రయాణంలో తమ తొలి లక్ష్యం నెరవేరిందన్నాడు. వన్డే ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా.. అధికారికంగా సెమీస్ బెర్త్ను దక్కించుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై మాట్లాడిన రోహిత్ శర్మ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టీమిండియా సమష్టి ప్రదర్శనతోనే ఇది సాధ్యమైందని చెప్పాడు.

'అధికారికంగా మేం సెమీఫైనల్కు అర్హత సాధించడం సంతోషంగా ఉంది. చెన్నైలో ప్రారంభమైన మా ప్రపంచకప్ ప్రయాణంలో మొదటి లక్ష్యం నెరవేరింది. మేం గెలిచిన ఏడు మ్యాచ్ల్లో సమష్టిగా రాణించాం. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేయడం భారీ లక్ష్యాన్ని నమోదు చేయడం మాకు దక్కిన గొప్ప సవాల్.
350 పరుగుల టార్గెట్ ఎలాంటి వికెట్పై అయినా మంచి స్కోరే. ఈ గెలుపు క్రెడిట్ మా పేసర్లదే. అసాధారణ బౌలింగ్తో ఆకట్టుకున్నారు. శ్రేయస్ అయ్యర్ సత్తా ఏంటో మాకు బాగా తెలుసు. మానసికంగా అతను చాలా బలవంతుడు. అతని సత్తా ఏంటో ఈ రోజు చూపించాడు. ఈ మ్యాచ్ కోసం అతను చాలా కష్టపడ్డాడు. సూర్యకుమార్ కూడా గత మ్యాచ్లో అదరగొట్టాడు. కీలక సమయంలో విలువైన పరుగులు చేశాడు.
మహమ్మద్ సిరాజ్ క్వాలిటీ బౌలర్. అతను చెలరేగితే ఫలితమే భిన్నంగా ఉంటుంది. అతను బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. మా జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. మా సీమర్లు తమ క్వాలిటీ ఏంటో చూపెట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మా బౌలర్లు రాణించగలరు. మా బౌలర్ల ఆధిపత్యం చూడ ముచ్చటగా అనిపించింది.
డీఆర్ఎస్ నిర్ణయాన్ని కేఎల్ రాహుల్కే వదిలేసాను. వాస్తవానికి అది నాటౌట్ అని నా అభిప్రాయం. కానీ రాహుల్ పట్టు బట్టి రివ్యూ తీసుకునేలా చేశాడు. చివరకు ఫలితం మాకు అనుకూలంగా వచ్చింది. ఈ రోజు రెండు రివ్యూలు తీసుకుంటే ఒకటి అనుకూలంగా.. మరొకటి ప్రతీకూలంగా వచ్చింది. సౌతాఫ్రికా అసాధారణ క్రికెట్ ఆడుతోంది. ఆ జట్టుతో మా పోరు అత్యంత ఆసక్తికరంగా ఉండనుంది. అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 358 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 92), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 11 ఫోర్లతో 88), శ్రేయస్ అయ్యర్(56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో రాణించారు.
మహమ్మద్ షమీ(5/18), మహమ్మద్ సిరాజ్(3/18) సంచలన ప్రదర్శనతో శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలింది.