
రాహుల్తో స్వేచ్చగా..
'ఇది చాలా క్లోజ్ మ్యాచ్. ఇలాంటి మ్యాచ్లు చాలా నేర్పుతాయి. తీవ్ర ఒత్తిడిలో మేం ఇన్నింగ్స్ నిర్మించాం. వన్డేల్లో చాలా రోజుల నుంచి కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతని వల్ల బ్యాటింగ్ డెప్త్ పెరగడమే కాకుండా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. టాపార్డర్ బ్యాటర్లు స్వేచ్చగా ఆడగలిగే అవకాశం లభించింది. బ్యాటింగ్ బలాన్ని పెంచింది. టాప్-5 బ్యాటర్లలో లెఫ్టాండర్ ఉంటే బాగుంటుంది. కానీ దీన్ని నేను పెద్దగా పట్టించుకోను. మాకు లెఫ్టాండ్ బ్యాటర్ ఉంటే బాగానే ఉంటుంది. కానీ మా మిడిలార్డర్ బ్యాటర్ల సత్తా, నైపుణ్యం ఏంటో మాకు బాగా తెలుసు. వారికి తీవ్ర ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు.

మార్పులు ఉంటాయ్..
చివరి వన్డేలో మార్పుల గురించి ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాని గురించే ఆలోచించలేదు. చివరి మ్యాచ్ వేదికకు వెళ్లాక, పిచ్ కండిషన్స్ చూసి.. మా ఆటగాళ్ల పరిస్థితిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఈ సిరీస్ అనంతరం న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఉన్న నేపథ్యంలో మా ఆటగాళ్లను ఫ్రెష్గా ఉంచడం చాలా ముఖ్యం. మాకు లాంగ్ సీజన్ ఉన్న నేపథ్యంలో ప్రతీది పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటాం. కొన్ని మార్పులు అయితే చేస్తాం.

కుల్దీప్ సూపరో సూపర్..
కుల్దీప్ యాదవ్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అసాధారణ ప్రదర్శనతో మమ్మల్ని మ్యాచ్లో నిలబెట్టాడు. శ్రీలంక అద్భుతమైన ఆరంభం అందుకున్న తర్వాత కుల్దీప్ బ్రేక్ త్రూ అందించాడు. బౌలింగ్ వచ్చినప్పుడల్లా వికెట్ తీసాడు. ప్రస్తుతం అతను బౌలర్గా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఇది ఖచ్చితంగా జట్టుకు మంచి చేస్తుంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

రాహుల్ హాఫ్ సెంచరీతో..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ నువనిందు ఫెర్నాండో(50) ఒక్కడే రాణించగా.. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్ల, ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 43.2 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్(103 బంతుల్లో 6 ఫోర్లతో 64 నాటౌట్) అండగా హార్దిక్ పాండ్యా(53 బంతుల్లో 4 ఫోర్లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో కరుణరత్నే, లాహిరు కుమార రెండేసి వికెట్లు తీయగా.. కసున్ రజిత, ధనంజయ డిసిల్వా చెరొక వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications
