
అహ్మదాబాద్: సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో ఏగలేకపోతున్నానని, ప్రతీ బంతికి అప్పీల్ చేయమని ఇబ్బంది పెడుతాడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తెలిపాడు. ఇండోర్ టెస్ట్లో డీఆర్ఎస్ల వృథా చేయడంపై స్పందిస్తూ.. జడేజా కారణంగానే రివ్యూలన్నీ వృథా అయ్యాయని చమత్కరించాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన భారత్.. మూడో టెస్ట్లో మాత్రం ఓటమిపాలైంది. పేలవ బ్యాటింగ్తో పాటు స్వీయ తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. డీఆర్ఎస్లను కూడా రోహిత్ సేన సరిగ్గా వాడుకోలేకపోయింది. తొలి రోజే అన్ని రివ్యూలను వృథా చేసి ఇబ్బందులు ఎదుర్కొంది. ఇండోర్ టెస్ట్లో డీఆర్ఎస్ విషయంలో భారత్ సరైన నిర్ణయాలు తీసుకోలేదని, నాలుగో టెస్టులో ఈ తప్పిదాలను సరిదిద్దుకుంటామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ బుధవారం మీడియాతో మాట్లాడాడు.
'ఇండోర్ టెస్ట్లో మేం డీఆర్ఎస్లను సరిగ్గా వాడుకోలేకపోయాం. సరైన నిర్ణయాలకు ఉపయోగించుకోలేదు. ఈ తప్పిదాన్ని అంగీకరిస్తున్నాం. డీఆర్ఎస్ తీసుకోవడం కష్టం. ముఖ్యంగా రవీంద్ర జడేజాతో ఈ విషయంలో ఏగలేకపోతున్నా.. అతను ప్రతి బంతిని ఔట్ అని భావిస్తూ.. అప్పీల్ చేయమంటాడు. మూడో టెస్ట్లో చేసిన తప్పులను నాలుగో టెస్టులో సరిదిద్దికుంటామని ఆశిస్తున్నాం. దీనిపై ఇప్పటికే మేం చర్చించుకున్నాం. ఈ మ్యాచ్లో డీఆర్ఎస్ను సరిగ్గా వినియోగించుకుంటామని భావిస్తున్నాం' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇక అతి విశ్వాసం వల్లే ఇండోర్ టెస్ట్లో టీమిండియా ఓడిపోయిందని రవి శాస్త్రి చేసిన కామెంట్స్పై రోహిత్ ఘాటుగా స్పందించాడు.బయటి వ్యక్తులు చేసే ఇలాంటి వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాలుగో టెస్ట్లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకోవడంతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖారు చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.