ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాకు దుబాయ్ వేదికగానే అన్ని మ్యాచ్లు నిర్వహిస్తుండటంపై వచ్చిన విమర్శలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. దుబాయ్ ఏం తమ హోమ్ గ్రౌండ్ కాదని, తమకు కూడా కొత్తేనని స్పష్టం చేశాడు. దుబాయ్ మైదానంలో 5 పిచ్లు ఉన్నాయని, సెమీఫైనల్కు ఏ పిచ్ వాడుతారో తమకు తెలియదన్నాడు. గత మూడు మ్యాచ్ల్లో పిచ్లు విభిన్నంగా స్పందించాయని వివరణ ఇచ్చాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండటంతో ఆ దేశంలో పర్యటించేందుకు బీసీసీఐ నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో ఐసీసీ హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తటస్థ వేదికైన దుబాయ్ వేదికగా భారత మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే ఒకే వేదికగా టీమిండియా మ్యాచ్లు జరుగుతుండటం వల్ల ఆ జట్టుకు అదనపు ప్రయోజనం కలుగుతుందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు ఐసీసీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఈ విమర్శలపై సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. టీమిండియా కారణంగానే ఇంగ్లండ్ కామెంటేటర్లకు జీతాలు వస్తున్నాయనే విషయాన్ని గ్రహించాలని చురకలంటించాడు.
Ghar nahi hai, 𝐃𝐮𝐛𝐚𝐢 hai! 🔥
— Star Sports (@StarSportsIndia) March 3, 2025
Skipper @rohitsharma isn’t sure about the semi-final pitch, but he’s more than ready for the #ToughestRivalry! 💪#ChampionsTrophyOnJioStar Semi-Final 1 👉 #ToughestRivalry #INDvAUS | TUE, 4TH MAR, 1:30 PM on Star Sports 1, Star Sports 1… pic.twitter.com/rEmCPF05Yj

ఇదేం మా హోమ్ గ్రౌండ్ కాదు..
తాజాగా ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో సోమవారం రోహిత్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిథులు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ల విమర్శలను రోహిత్ ముందు ప్రస్తావించగా తనదైన శైలిలో బదులిచ్చాడు. 'ప్రతీసారి పిచ్ భిన్నమైన సవాళ్లను విసురుతోంది. మేం ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్ల్లో పిచ్ విభిన్నంగా స్పందించింది. దుబాయ్ ఏం మా హోం గ్రౌండ్ కాదు. మా జట్టు ఇక్కడ ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. ఈ మైదానం మాకు కూడా కొత్తే.
హోరా హోరీ తప్పదు..
ఈ మైదానంలో నాలుగు, ఐదు పిచ్లు వాడుతున్నారు. సెమీఫైనల్లో ఏ పిచ్పై ఆడుతామో మాకు కూడా తెలియదు. ఏ వికెట్పై ఆడుతున్నామనే విషయంతో సంబంధం లేకుండా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాలి. ఏం జరుగుతుందనే విషయాన్ని పట్టించుకోకుండా ఎలాంటి పిచ్పైనైనా ఆడేందుకు సిద్దం కావాలి. ఆస్ట్రేలియా చాలా బలమైన జట్టు. వారి నుంచి మాకు గట్టి పోటీ ఎదురువుతుందని భావిస్తున్నాం. మధ్యలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవ్వవచ్చు. ఇప్పటికే ఈ మ్యాచ్ గురించి జట్టులో చర్చించాం. ఇరు జట్లపై ఈ మ్యాచ్ గెలవాలనే ఒత్తిడి ఉంటుంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.