
క్రెడిట్ అంతా కోహ్లీదే..
'ఓ టెస్ట్ టీమ్గా ప్రస్తుతం మేం మంచి స్థానంలో ఉన్నాం. ఈ క్రెడిట్ అంతా విరాట్ కోహ్లీదే. కొన్నేళ్లుగా తన సారథ్యంలో జట్టును అద్భుతంగా నడిపించాడు. అతనిలానే నేను జట్టును ముందుకు తీసుకెళ్తాను. డబ్ల్యూటీసీ టోర్నీ టేబుల్లో మేం మధ్యలో ఉన్నాం. టోర్నీలో ముందుకు సాగాలంటే మిగిలిన 9 మ్యాచ్ల్లో మేం ప్రతీది గెలవాలి. గత రెండు మూడేళ్లుగా మేం ఎలాంటి తప్పిదాలు చేయలేదు. జట్టు లక్ష్యాలను నేను ఇప్పటికే సెట్ చేశాను.

కోహ్లీ సూపర్..
నేను నా కెరీర్లో 40 మ్యాచ్లే ఆడి ఉండవచ్చు. కానీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. మరెన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇప్పుడు నా చేతిలో గొప్ప బాధ్యత ఉంది. ఇప్పుడు నా దృష్టంతా దానిపైనే ఉంది. ఇక విరాట్ కోహ్లీ కెరీర్లో 100వ మ్యాచ్ ఆడటం గొప్ప విషయం. ఈ ఫార్మాట్లో అతను గొప్పగా రాణించాడు. జట్టులో ఎన్నో మార్పులు తీసుకొచ్చి అద్భుత విజయాలు అందించాడు. అతని 100వ మ్యాచ్లో విజయం సాధించి విరాట్కు కానుకగా ఇవ్వాలనుకుంటున్నాం.

ఆ ఇన్నింగ్స్ చాలా స్పెషల్..
ఇక 2018 సౌతాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీ నాకు చాలా స్పెషల్. బ్యాటింగ్ ప్రతీకూలమైన పిచ్పై విరాట్ అద్భుతంగా ఆడాడు. డేల్ స్టేయిన్, క్రిస్ మోరీస్ వంటి భీకరమైన పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఆ ఇన్నింగ్స్ నేను ఇప్పటికీ మరిచిపోలేను. చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేల స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు. జట్టుకు వారు అందించిన సేవలను మాటల్లో చెప్పలేం. ఓవర్ సీస్ విజయాలు, టెస్ట్ల్లో నెంబర్ వన్ ర్యాంక్ వంటి ఘనతలు వారి వల్లే సాధ్యమయ్యాయి.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
