
ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత గవర్నమెంట్ 21 రోజులపాటు లాక్డౌన్ ప్రకటించడంతో.. దొరికిన ఖాళీ సమయాన్ని క్రీడాకారులు తమకు నచ్చిన విధంగా ఆస్వాదిస్తున్నారు. భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ టైమ్ను ఫ్యామిలీతో గడుపుతున్నాడు.
అయితే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, రోహిత్ శర్మ మధ్య ఓ చాట్సెషన్లో ఆసక్తికర సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ట్విటర్లో శనివారం పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పీటర్సన్తో హిట్మ్యాన్ మాట్లాడుతూ.. తాను హౌజ్ క్లీనింగ్ చేశానన్నాడు. చివరిసారిగా ఇంటి పనులు ఎప్పుడు చేశానో తనకు గుర్తు లేదన్నాడు. కానీ.. ఇప్పుడు ఇల్లు శుభ్రం చేయడానికి తనకు దాదాపు రెండు గంటలు పట్టిందన్నాడు. అలాగే ఇంటిని శుభ్రం చేయడం అంత సులవైన పని కాదని కూడా రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఇదే చాట్ సెషన్లో ఐపీఎల్ జరుగుతుందా? అనే ప్రశ్నకు పరిస్థితులు అనుకూలిస్తే జరిగే చాన్సుందన్నాడు. ఇక తన కెరీర్లో అత్యంతగా బాధపెట్టిన సందర్భం 2011 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడమేనని తెలిపాడు. దానికి తన చెత్త ప్రదర్శననే కారణమని చెప్పుకొచ్చాడు.
అంత సవ్యంగా ఉంటే ఈ రోజు(మార్చి 29) ముంబైలోని వాంఖడే వేదికగా డిఫెండింగ్ చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమయ్యేది. కానీ కరోనా మహమ్మరి దెబ్బకు ప్రపంచమే అతలాకుతలమైంది. క్రీడారంగం పూర్తిగా స్థంభించింది. దీంతో బీసీసీఐ ఏప్రిల్ 15కు ఈ క్యాష్ రిచ్ లీగ్ను వాయిదా వేసింది. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే ఈ సీజన్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.