చెన్నై: వన్డే ప్రపంచకప్ 2023 లాంటి మెగా టోర్నీ ఆడుతున్నప్పుడు ఒత్తిడి అనేది సహజంగానే ఉంటుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రొఫెషనల్ ప్లేయర్లుగా ఒత్తిడి అధిగమించి ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. తన 16 ఏళ్ల క్రికెట్ అనుభవం ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిందన్నాడు.
వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్కు టీమిండియా సిద్దమైంది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చాడు.

ఈ క్రమంలోనే సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్లో తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయని, ఈ ఒత్తిడిని ఎలా అధిగమిస్తారని అడిగిన ప్రశ్నకు రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు.
'16 ఏళ్ల నా క్రికెట్ అనుభవం ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పింది. ఈ తరహా బిగ్ టోర్నీల్లో ఆటగాళ్లు, జట్లు ఒత్తిడికి గురవ్వడం సహజం. ఒత్తిడి అనేది ఎక్కడైనా ఉంటుంది. దాని గురించి మాట్లాడటమే అనవసరం. బయటి విషయాలను పట్టించుకోవద్దని మేం డిసైడ్ అయ్యాం. మా ఆటగాళ్లంతా మానసికంగా ధృడంగా ఉన్నారు. ఎవరి బాధ్యతలపై వారు స్పష్టతతో ఉన్నారు. ప్రత్యర్థి జట్టును బట్టి మేం గేమ్ ఆడుతాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఓ బ్యాటర్గా జట్టుకు ఏం చేయగలనో అది చేయడానికి 100 శాతం ప్రయత్నిస్తానని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. మైదానం కండిషన్స్ పెద్ద విషయమే కాదని, చెన్నై వేదికగా ఆడిన అనుభవం ఆసీస్ ఆటగాళ్లకు చాలా ఉందని తెలిపాడు.
'ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెన్నైలో చాలా క్రికెట్ ఆడారు. ఐపీఎల్తో పాటు గతంలో మూడు వన్డేలు ఆడారు. వారికి ఈ అనుభవం ఉపయోగపడనుంది. కానీ కండిషన్స్ పెద్ద విషయమే కాదు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడుతున్న వారికి మైదాన పరిస్థితులు పెద్దగా లెక్కనే కాదు. హార్దిక్ పాండ్యా కారణంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే వెసులు బాటు మాకు ఉంది. హార్దిక్ మూడో పేసర్గా బాధ్యతలు తీసుకుంటాడు. అతని వల్ల జట్టుకు మంచి సమతూకం రానుంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.