టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. తన సహచర బ్యాటర్ విరాట్ కోహ్లీకి సలాం పెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరేముందు ఢిల్లీ విమానాశ్రయంలో టీమ్ బస్సు ఎక్కేముందు విరాట్ కోహ్లీని చూసిన రోహిత్ వెంటనే వంగి సలామ్ చేశాడు. బస్సులోకి ఎక్కిన రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ హగ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారగా.. రోకో బాండింగ్ ఇది అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్యూటీఫుల్ వీడియో అని క్యాప్షన్ ఇస్తున్నారు.
మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియా బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియా బయలుదేరారు. ముందుగా వన్డే సిరీస్ జరగనుండగా.. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్తోనే కోహ్లీ, రోహిత్ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. టీ20, టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ.. ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు.

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసినా.. రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి శుభ్మన్ గిల్ను కొత్త సారథిగా ఎంపిక చేశారు. వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. దాంతో కోహ్లీ, రోహిత్ వన్డే ప్రపంచకప్ 2027 ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.
కోహ్లీ, రోహిత్లు మాత్రం వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా సిరీస్ వారి కెరీర్కు ఓ దిశానిర్దేశం కానుంది. ఈ మూడు వన్డే మ్యాచ్ల్లో కనబర్చే ప్రదర్శనపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ సిరీస్లో విఫలమైతే వారికి వారే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.
మెగా టోర్నీకి మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. అప్పటికి రోహిత్ శర్మ వయసు 40 ఏళ్లకు చేరుతుంది. ఆ వయసులో ఆడటం కష్టమనే అభిప్రాయం నెలకొంది. ఈ క్రమంలోనే అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు. మరోవైపు రోహిత్ శర్మ మాత్రం వన్డే ప్రపంచకప్ గెలిచే ఆట నుంచి తప్పుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే ఫిట్నెస్పై ఫోకస్ పెట్టిన రోహిత్.. 20 కిలోల బరువు తగ్గాడు.