
అసలేం జరిగిందంటే.. 243 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. అశ్విన్ ధాటికి కుదేలు అయ్యింది. హాఫ్ సెషన్ కూడా క్రీజులో నిలబడలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా 18వ ఓవర్ను అశ్విన్ వేయగా.. తొలి బంతికి పీటర్ హ్యాండ్స్కోంబ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఔటివ్వలేదు. దాంతో టీమిండియా రివ్యూ తీసుకోగా.. థర్డ్ అంపైర్ రిప్లేలను పరిశీలించాడు. ఈ సమయంలో బ్రాడ్కాస్టర్ రిప్లేలను చూపించకుండా రోహిత్ శర్మను చూపించింది. దాంతో అసహనానికి గురైన రోహిత్..'నా ముఖంలో ఏం ఉందిరా..? రిప్లే చూపించు'అని తిట్టడం టీవీ కెమెరాల్లో కనిపించింది. రోహిత్ మాటలకు పక్కనున్న ఆటగాళ్లంతా పడి పడి నవ్వారు.
243 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(25 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(5/37) ఐదు వికెట్ల ఘనత అందుకోగా.. జడేజా(2/34), మహమ్మద్ షమీ(2/13) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో నాలుగు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
అంతకుముందు 321/7 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ను 139.3 ఓవర్లలో 400 పరుగులకు ముగించింది. ఓవర్నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా(70) త్వరగానే ఔటైనా.. అక్షర్ పటేల్(174 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 84) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. టెయిలెండర్ మహమ్మద్ షమీ(47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 37) విలువైన పరుగులతో భారత్కు భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఏడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. నాథన్ లియోన్కు ఓ వికెట్ దక్కింది.