న్యూఢిల్లీ: బౌలింగ్ చేస్తున్నప్పుడు వేలికి ఇబ్బంది కలగడంతోనే పూర్తిగా మానేసానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. బౌలింగ్తో కలుగుతున్న అసౌకర్యం బ్యాటింగ్పై ప్రభావం పడవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. కెరీర్ ఆరంభంలో స్పిన్ బౌలింగ్తో రాణించాడు. ఐపీఎల్ 2009 సీజన్లో డెక్కన్ చార్జర్స్ తరఫున హ్యాట్రిక్ వికెట్ సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్లోనూ పార్ట్ టైమ్ బౌలర్గా రాణించాడు. ఓపెనర్గా ప్రమోషన్ అందుకున్న తర్వాత అతను బౌలింగ్కు పూర్తిగా దూరమయ్యాడు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బౌలింగ్ మానేయడానికి గల కారణాలను వెల్లడించాడు.

'బౌలింగ్ చేస్తున్నప్పుడు నా వేలికి అసౌకర్యం కలగడం మొదలైంది. అది నా బ్యాటింగ్పై ప్రభావం చూపించవద్దనే బౌలింగ్ వేయడం తగ్గించాను. అయితే ఇప్పటికీ కొన్నిసార్లు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. అవసరమైతే బౌలింగ్ చేయడానికి సిద్ధమే. చూద్దాం ఏం జరుగుతోందో.'అని తెలిపాడు.
వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో గత 9 నెలలుగా ఇన్స్టాగ్రామ్, ట్విటర్ యాప్లను తన మొబైల్లో ఉపయోగించడం లేదని చెప్పాడు. కమర్షియల్ పోస్ట్లను తన సతీమణి చూసుకుంటుందని చెప్పిన హిట్ మ్యాన్.. సోషల్ మీడియా యాప్లతో సమయం వృథా అవ్వడంతో పాటు ఫోకస్ తప్పుతుందన్నాడు. ఈ కారణంతోనే నా మొబైల్ నుంచి ఈ రెండు యాప్లను తొలగించానని చెప్పాడు.
తన దృష్టిలో కెప్టెన్ అనేవాడు ముఖ్యమైన వాడు కాదని, మిగతా 10 మంది ఆటగాళ్లే అతి ముఖ్యమైనవారని తెలిపాడు. తన ఫిలాసఫీ అదేనని చెప్పాడు. ఎందుకంటే మిగతా 10 మంది దగ్గర్నుంచే అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాలన్నాడు.

తాను ఒకే విషయం గురించి అతిగా ఆలోచించే రకం కాదని చెప్పిన రోహిత్.. గత 10 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదనే విషయాన్ని ఒప్పుకుంటానని తెలిపాడు. అయితే దీని గురించి పదే పదే ఆలోచిస్తూ అనాలోచిత నిర్ణయం తీసుకునే రకం తాను కాదని చెప్పాడు.
అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా జరిగే మ్యాచ్తో టీమిండియా తమ క్యాంపైన్ను షురూ చేయనుంది.
అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదీ పాకిస్థాన్తో మెగా మ్యాచ్ ఆడనుంది. అయితే మెగా టోర్నీకి సన్నాహక మ్యాచ్లు లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. టీమిండియా ఆడాల్సిన రెండు వామప్ మ్యాచ్లు వర్షం కారణంగా బంతి పడకుండానే రద్దయ్యాయి.